నిర్భయ దోషుల ఉరి జాప్యం !!.. ఉరిశిక్ష జాప్యానికి కారణం ఢిల్లీ సర్కార్ అన్న కేంద్ర మంత్రి
2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరితీత అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది. అనేక పరిణామాల నేపధ్యంలో ఆపై దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను వేర్వేరు పిటిషన్ల ద్వారా క్షమాభిక్ష కోరాడు. దీంతో ఉరితీతకు ఇబ్బంది ఏర్పడింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. అంతేకాదు, ఆ పిటిషన్ ను తోసిపుచ్చాలంటూ కేంద్ర హోంశాఖకు కూడా సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో తాము సకాలంలో ఉరి శిక్ష అమలు చేయలేమంటూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు విన్నవించుకున్నారు. ఉరితీత తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఉరితీత జాప్యమయ్యే అవకాశాల గురించి తీహార్ జైలు అధికారులు అటు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఓ లేఖ రాశారు. ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉందని, జైలు నిబంధనల ప్రకారం మరణశిక్ష అమలుచేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఉరిశిక్ష అమలు తేదీని మార్చాలని కోర్టును వారు కోరారు .
ఇదిలా ఉంటె ఇక నిర్భయ దోషుల ఉరితీతలో జాప్యం జరగడానికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. క్షమాభిక్ష పిటీషన్ ను దోషులు దాఖలు చేశారని.. రెండున్నర ఏళ్లలో కేజ్రీవాల్ సర్కారు ఎందుకు నోటీసు జారీ చేయలేదని కేంద్రమంత్రి ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన వారంలోగా ఆప్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఉంటే ఈ నలుగురు దోషులను ఉరితీసేవారని, ఈ దేశానికి న్యాయం జరిగేదని పేర్కొన్నారు. ఇలా నిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యానికి ఢిల్లీ సర్కారు కారణమని కొత్త వాదనను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వినిపించారు.