మావల్లే ఓటమి, కిరణ్ బేడీ బాధ్యురాలు కాదు: ఢిల్లీ ఓటమిపై వెంకయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తమ వల్లే ఓడిపోయామని అంగీకరించారు. కొందరు బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే దెబ్బతీశాయన్నారు. ఓటమికి కిరణ్ బేడీని బాధ్యురాలిని చేయలేమని చెప్పారు.
కరడుగట్టిన హిందుత్వవాదుల వివాదాస్పద వ్యాఖ్యలు దెబ్బతీశాయని అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఓటమి నుండి తాము పాఠం నేర్చుకోవాల్సి ఉందన్నారు. కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
ఢిల్లీ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించడం వ్యూహాత్మక తప్పిదమన్నారు. దానికి తగ్గమూల్యం బీజేపీ చెల్లించుకుందని, ఇది సమష్టి నిర్ణయమే అన్నారు. హిందువులు ఎప్పుడు శాంతిని కోరుకుంటారని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలను తాము తిరస్కరించామన్నారు. ప్రార్థనాలయా న జరిగిన దాడిని ఖండించామన్నారు.
ఆంధ్రప్రదేశ్కు యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదని, నవ్యాంధ్రకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని వెంకయ్యనాయుడు వేరుగా అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తాము అనలేదన్నారు. హోదా ఎలా ఇవ్వాలనే అంశంపైనే అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.