భవనంపైనుంచి పడి ఎయిర్హోస్టెస్ అనుమానాస్పద మృతి, భర్తే చంపేశాడా?
Recommended Video
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎయిర్హోస్టెస్ భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆమె భర్త ఇది ఆత్మహత్య అని చెప్తుండగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని హత్య చేశారని చెబుతున్నారు.
అనిస్సియా భత్రా అనే 32ఏళ్ల యువతి లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో ఎయిర్హోస్టెస్గా పనిచేస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్కు ప్రాంతంలోని ఇంటిపై నుంచి శుక్రవారం రాత్రి దూకడంతో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా అత్తింటి వారు ఆమెను వేధిస్తున్నారని.. ఇది హత్యే అని అనిస్సియా తల్లిదండ్రులు చెబుతున్నారు.
రెండేళ్ల క్రితమే వివాహం.. వేధింపులపై ఫిర్యాదు
అనిస్సియాకు రెండేళ్ల క్రితం మయాంక్ సింఘ్వితో వివాహమైందని, అప్పటి నుంచి ఆమె భర్తతో పాటు అత్తింటి వారంతా వేధిస్తున్నారని అనిస్సియా తండ్రి రిటైర్డ్ మేజర్ జనరల్ ఆర్ఎస్ భత్రా గత కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి వచ్చి ఆమెను డబ్బు కావాలని హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని రాతపూర్వకంగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు చేసిన రెండు రోజులకే విగత జీవిగా..
కాగా, ఇది జరిగిన కొద్ది రోజులకే(గత శుక్రవారం రాత్రి) అనిస్సియా విగతజీవిగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి సింఘ్వి కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. అనిస్సియా టెర్రస్పై నుంచి దూకడానికి కొన్ని నిమిషాల ముందే చనిపోబోతున్నానని మెసేజ్ పంపిందని అప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, కానీ టెర్రస్పైకి వెళ్లేసరికి దూకేసిందని మయాంక్ సింఘ్వి పోలీసులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లానని, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు వెల్లడించారని సింఘ్వి తెలిపారు.
సోదరుడికి ఫోన్ చేసి...
అయితే ఈ ఘటనపై అనిస్సియా సోదరుడు కరణ్ భత్రా స్పందన మరోలా ఉంది. అనిస్సియా చనిపోవడానికి కొద్దిసేపు ముందు తనకు మెసేజ్ చేసిందని చెప్పారు. మయాంక్ తనను గదిలో బంధించాడని, పోలీసులకు ఫోన్ చేయమని తనను అడిగిందని తెలిపారు. మయాంక్ కారణంగా తాను జీవితాన్ని కోల్పోతున్నానని, దయచేసి అతడిని వదలొద్దని మెసేజ్ చేసిందని చెప్పారు. అయితే, మయాంకే ఆమెను తోసేశాడా, లేదంటే ఆమే దూకిందా? అనే విషయం తమకు తెలియదని కరణ్ మీడియాకు తెలిపారు.
ఆమె తల్లిదండ్రులపైనా దాడి... ఆధారాలు మాయం
జూన్ నెలలో తమ తల్లిదండ్రులు చండీగఢ్ నుంచి వచ్చారని, అప్పుడు మయాంక్ వారిని కూడా కొట్టాడని కరణ్ తెలిపారు. జూన్ 27న తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తిరిగి చండీగఢ్ వెళ్లిపోయారని తెలిపారు. అనిస్సియా చనిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారని.. కానీ మయాంక్ గత రాత్రి అక్కడ ఆధారాలేమీ లేకుండా చేశాడని కరణ్ ఆరోపించారు. పోలీసులు తమకు ఏ విధంగానూ సహకరించడంలేదని, తాము చెప్పేది వినిపించుకోవడం లేదని కరణ్ వాపోయారు. ఇది ఇలా ఉంటే, ఆమె పనిచేస్తున్న ఎయిర్వేస్ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేకే అనిస్సియా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు.