ఢిల్లీ కాలుష్యం: ఫలితం ఇచ్చిన సరి బేసి విధానం..తగ్గుముఖం పట్టిన కాలుష్యం
న్యూఢిల్లీ: గతమూడు రోజులుగా ఢిల్లీ నగరం కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. మూడు రోజులుగా ఢిల్లీ వాసులు గాలిలోని కాలుష్యంను పీల్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం సరిబేసి విధానంకు మళ్లీ తెరతీయడంతో సోమవారంతో పోలిస్తే మంగళవారం ఉదయంకు గాలిలోని కాలుష్య తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక మంగళవారం సాయంత్రం కల్లా మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. 2016 తర్వాత ఆదివారం రోజున కాలుష్యం ఎప్పుడూ లేనంతగా తాండవం చేసింది.
మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలిలోని నాణ్యత 370గా రికార్డు అయ్యింది. అదే సోమవారం రోజున కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 407గా ఉన్నింది. ఇది తీవ్ర స్థాయిలో ఉన్నిందని అధికారులు చెప్పారు. ఆదివారం రోజున గాలి నాణ్యత 494గా ఉన్నింది. ఇది ప్రమాదకర స్థాయిని సూచించింది. డిసెంబర్ 2016 తర్వాత ఈ స్థాయిలో ఎప్పుడూ రికార్డు కాలేదని అధికారులు తెలిపారు. సోమవారం రోజున గాలులు వేగంగా వీయడంతో కాలుష్య కారకాలు తొలగిపోయాయని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దీపావళి తర్వాత తొలిసారిగా ఆకాశం కాస్త స్పష్టంగా కనిపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూర్యకిరణాలు భూమిపై పడ్డాయని చెప్పారు. అంతేకాదు గాలులు కూడా వేగం పుంజుకున్నాయని చెప్పిన వాతావరణశాఖ అధికారులు... గాలి నాణ్యతను పెంచేందుకు దోహదపడిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఉన్న కాలుష్యం సోమవారం మధ్యాహ్న సమయానికల్లా తగ్గిందని చెప్పారు. మంగళవారం రోజున మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నవంబర్ 6వ తేదీన వర్షాలు పడే అవకాశం ఉండటంతో మేఘాలు కమ్మేస్తాయని దీంతో మళ్లీ గాలిలో నాణ్యత తగ్గే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ.
Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లు
ఇక అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సరిబేసి సంఖ్య విధానం మెరుగైన ఫలితాలు ఇచ్చిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సోమవారం రోజున దాదాపు 15 లక్షల కార్లు ఇళ్లకే పరిమితం అవడంతో గాలిలో కాలుష్యం చాలావరకు తగ్గిందని గుర్తుచేశారు. ఇక సరిబేసి విధానంను ఉల్లంఘించిన 259మందికి ఢిల్లీ సర్కార్ జరిమానా విధించింది. ఇలా జరిమానా పడ్డ వారిలో బీజేపీ నేత విజయ్ గోయల్ కూడా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కేజ్రీ సర్కార్ సరిబేసి విధానంను ప్రవేశపెట్టిందని బీజేపీ నాయకులు విమర్శించారు.