505నుంచి 365కి చేరిన ఏక్యూఐ.. హస్తినలో క్రమంగా తగ్గుతున్న కాలుష్యం..
వాయు కాలుష్యంతో ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. దీంతో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలు తీసుకోవడంతో గత ఐదురోజుల నుంచి గాలి నాణ్యత సూచికతో కాలుష్యం తగ్గుతుంది. స్కూళ్లు, కాలేజీలకు ఐదురోజులు ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సరి, బేసి సంఖ్య అమలు చేయడంతో వాయు కాలుష్యం తగ్గి.. హస్తినలో కాస్త పరిస్థితి మెరుగుపడింది.
తగ్గుతుంది
గత ఐదురోజుల నుంచి గాలి నాణ్యత సూచిక మెరుగవుతోంది. అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో ఆప్ సర్కార్ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చింది. దీంతోపాటు నగరంలో సరి, బేసి విధానాన్ని కూడా అమలు చేసింది. దీంతో శనివారం ఏక్యూఐ 505 నమోదుకాగా.. అది ఆదివారం ఉదయానికి 365కి చేరింది.
స్కూళ్లు, కాలేజీలు బంద్
దేశ రాజధానితోపాటు పరిసర ప్రాంతాల పరిధిలో కూడా స్కూళ్లను మూసివేశారు. దీంతో లోది రోడ్డులో 254 ఏక్యూఐ రికార్డైంది. ఇది తీవ్రమైన స్థాయి నుంచి పూర్ క్యాటగిరీ అని అధికారులు పేర్కొన్నారు. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అదే చాందిని చౌక్లో 299 ఉందని వెల్లడించారు.
అక్కడ మాత్రం
ఇక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మాత్రం కాస్త పెరిగింది. 315కి చేరి వెరీ పూర్ క్యాటగిరీలో ఉంది. దీంతోపాటు మధుర రోడ్డులో కూడా ఇలానే ఏక్యూఐ నమోదయ్యింది. నోయిడాలో కూడా 299 రికార్డైంది.
కారణమిదే..
ఢిల్లీలో సరి బేసి సంఖ్య అమలు చేస్తేనే కాలుష్యం తగ్గుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 4 నుంచి 15 వరకు సరి, బేసి సంఖ్య అమలైంది. కానీ 11, 12వ తేదీల్లో మాత్రం నిలిపివేశారు. గురునానన్ 550వ జయంతి సందర్భంగా ఆంక్షలు సడలించారు. సరి, బేసి సంఖ్యను తిరిగి అమలు చేసే అంశంపై సోమవారం మరోసారి సమీక్షిస్తానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.