పాకిస్తాన్ ప్రేలాపనలతో విమానాశ్రయాలకు భారీ బందోబస్తు: ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు ఫలితంగా భారత్ లో పుల్వామా తరహా ఆత్మాహూతి దాడులు చోటు చేసుకోవచ్చని, ఉగ్రవాదుల దాడులకు దిగుతారని స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. దీనికితోడు- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సైతం సమీపిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలో దాదాపు అన్ని నగరాలతో అనుసంధానమై ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను మరింత బలోపేతం చేసింది. ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉండబోతున్నాయి.
వీడియో: మీ మాటలకేం గానీ.. కాశ్మీర్లో అసలు సమస్య ఉందంటూ లెక్చర్ దంచిన మందుబాబు!
మూడు గంటలు ముందుగా విమానాశ్రయానికి
దేశీయంగా విమాన ప్రయాణాలు చేసేవారు ఎయిర్ పోర్ట్ కు కనీసం మూడు గంటలు ముందుగా చేరుకోవాల్సిందేనంటూ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన భద్రతా విభాగం గురువారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారు నాలుగు గంటలు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆదేశించారు. విమానం బయలుదేరే సమయానికి మూడు, నాలుగు గంటలు ముందుగా ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాశ్రయానికి చేరుకుని, భద్రతా పరమైన తనిఖీలను పూర్తి చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.
మూడు గంటల్లోగా చేరుకోకపోతే.. లోనికి అనుమతించే ప్రసక్తే లేదని భద్రతా విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. భద్రతాపరమైన చర్యలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని విన్నవించారు.
Attention Flyers: Due to enhanced security arrangements, flyers are requested to reach #DelhiAirport minimum 3 hours in advance for all domestic flights and 4 hours in advance for all international flights. [1/2]
— Delhi Airport (@DelhiAirport) August 7, 2019
ఇదే తరహా నిబంధనలు అన్ని చోట్లా
ప్రస్తుతానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే వర్తింపజేసేలా జారీ చేసిన ఈ నిబంధనలను దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్ పోర్టులకు వర్తింపజేయనున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోచి, నాగ్ పూర్, చండీగఢ్, కోల్ కత విమానాశ్రాయలకు విస్తరింపజేయనున్నారు. అన్ని ఎయిర్ పోర్టుల్లో డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని బ్యురో ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాశ్రయాల నిర్వాహకులను ఆదేశించింది.
Further, the entry to meters and greeters area will be barred w.e.f. 10th August to 20th August 2019. Any inconvenience caused is regretted. [2/2]
— Delhi Airport (@DelhiAirport) August 7, 2019
ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. భద్రతకు సంబంధించిన ఎలాంటి చిన్న విషయాన్నైనా నిర్లక్ష్యం చేయకూడదని, దీనిపై పౌర విమానయాన మంత్రిత్వశాఖకు సూచించాలని వారు విమానాశ్రయాల నిర్వాహకులను అప్రమత్తం చేశారు.