నాతో మూడో బిడ్డను కంటావా?: మహిళతో ఇమ్మిగ్రేషన్ అధికారి, అరెస్ట్
ఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగళూరుకు చెందిన ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఇమ్మిగ్రేషన్ అధికారి వినోద్కుమార్ అరెస్ట్ చేశారు.
కాగా, మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారి వినోద్ కుమార్ను సస్పెండ్ చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. సదరు మహిళపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై విచారణ జరపాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నిందితుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అసిస్టెంట్ ఇమ్మిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బెంగుళూరుకు చెందిన బాధిత యువతిని వ్యక్తిగత, అనుచిత ప్రశ్నలతో వేధించాడని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలోనే కాకుండా తన వెంటపడి మరీ వేధింపులకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
వ్యక్తిగత విషయాలను అడుగుతూ తనను వేధించినట్లు బాధితురాలు తెలిపింది. ‘నీకెంత మంది పిల్లలు. డ్రింక్ చేస్తావా? సిగరేట్ తాగుతావా? చికెన్ తింటావా? నీ భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో నీవు మరో పురుషునితో పడుకుంటావా? కుటుంబ నియత్రణ ఆపరేషన్ ఏమైనా చేసుకున్నావా? నాతో మూడో బిడ్డకు జన్మనిస్తావా?' లాంటి ప్రశ్నలతో వేధించాడని బాధితురాలు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసింది.