ఢిల్లీ ఎయిర్పోర్ట్ అలర్ట్: 2 ఎయిరిండియా విమానాలకు ఖలీస్తానీ ఉగ్రవాది బెదిరింపు
న్యూఢిల్లీ: రెండు ఎయిరిండియా విమానాలను లండన్ చేరుకోవడానికి అనుమతించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు రావడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జస్టిస్ ఫర్ సిఖ్స్(సిక్కులు) అనే గ్రూపు ఈ హెచ్చిరికలు జారీ చేసింది.
ఈ విషయం గురించి జాతీయడి మీడియాతో ఎయిర్పోర్టు డీసీపీ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. "జస్టిస్ ఫర్ సిఖ్స్తో సంబంధం ఉన్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి చాలా మందికి బెదిరింపు కాల్స్ చేశారు, నవంబర్ 5 న రెండు ఎయిరిండియా విమానాలు లండన్లో ల్యాండ్ కావొద్దంటూ ఈ గ్రూపు హెచ్చరించింది.
ఈ మేరకు అందిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు, విమానాశ్రయ అధికారులతో పాటు ఎయిర్ ఇండియా, విమానాశ్రయానికి కాపలాగా ఉండే సిఐఎస్ఎఫ్లు అప్రమత్తమయ్యారు.
ఖలీస్తానీ గ్రూప్ నుంచి నవంబర్ 5 బెదిరింపు.. న్యూఢిల్లీలో జరిగిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల 36 వ వార్షికోత్సవం సందర్భంగా రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విస్తృత తనిఖీలు చేపడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు.