దేశ రాజధానిలో భూప్రకంపనలు: ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత సానువుల్లో..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం భూమి ప్రకంపించింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అనేక ప్రాంతాల్లోనూ ఇవే తరహా ప్రకంపనలు నమోదైంది. దీనితో- భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగులు తీశారు.
ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయ పర్వత సానువుల్లో ఓ మోస్తరు భూకంపం చోటు చేసుకుందని, దాని ప్రభావం దేశ రాజధానిపై పడిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. సరిహద్దుల్లోని ఖప్తారా నేషనల్ పార్క్ పరిధిని భూకంప కేంద్రంగా నిర్ధారించారు. దాని ఫలితంగా- న్యూఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అంచనా వేస్తున్నారు.
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఏర్పడినట్టుగా అనుమానిస్తోన్న భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియరాావాల్సి ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అయిదు వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కొద్దిరోజుల కిందటే న్యూఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మొదలుకుని న్యూఢిల్లీ వరకు ఈ భూకంప తీవ్రత కనిపించింది.
సోమవారం సాయంత్రం కూడా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కఛ్-భచావూ-అంజార్ ప్రాంతంలో భూకంప తీవ్రత నమోదైంది. కఛ్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. భచావూ నుంచి పాకిస్తాన్ భూభాగం వైపు సుమారు 23 కిలోమీటర్ల దూరాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.