ఢిల్లీ అసెంబ్లీ పోల్: ఓటువేసిన ప్రథమ పౌరుడు, సోనియా, రాహుల్ గాంధీ, సీఈసీ, ఈసీ కూడా..
ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో గల 70 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సమస్యను పరిష్కరించారు. హస్తినలో ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. షహీన్బాగ్ ఘటన నేపథ్యంలో ఎన్నికల కోసం భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
రాష్ట్రపతి దంపతులు.
ఢిల్లీ కృష్ణానగర్లో గల రాతన్ దేవి పబ్లిక్ స్కూల్లో కేంద్రమంత్రి హర్షవర్ధన్, తల్లి కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. పండవ్ నగర్లో గల ఎంసీడీ స్కూల్ వద్ద తన భార్య సీమ సిసొడియాతో మనీశ్ సిసోడియా.. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
సోనియా, రాహుల్
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో గల నిర్మాన్ భవన్ వద్ద మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అతని భార్య గురుశరణ్ సింగ్..ఔరంగజేబు రోడ్డుల గల పోలింగ్ బూత్ 81,82 వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో గల నిర్మాన్ భవన్ వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా లోధిలోని పోలింగ్ బూత్ 114, 116 పోలింగ్ బూత్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తాప్పీ కూడా...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబసభ్యులతో కలిసి ప్రముఖ నటీ తాప్సీ పన్ను ఓటుహక్కు వినియోగించుకున్నారు. చాణక్యపురి ప్రాంతంలో గల పోలింగ్ స్టేషన్ వద్ద ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కరణ్ సింగ్.. ఔరంగజేబ్ లైన్ వద్ద గల పోలింగ్ బూత్లో తన కూతురు ప్రతిభ అద్వానీ ఓటేశారు. తర్వాత ఓటేసినట్టు విజయ సంకేతం చూపారు.
సీఈసీ, ఈసీ..
న్యూ మోతీబాగ్ పోలింగ్ బూత్ నంబర్ 99లో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఆయన భార్య నీలు చంద్ర ఓటు వేయగా.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో గల నిర్మాన్ భవన్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇటు గ్రేటర్ కైలాశ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గల ఎస్డీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఓటుహక్కు 110 ఏళ్ల శతాధిక వృద్ధురాలు కలిటారా మండల్ ఓటువేశారు. మరోవైపు షాకర్పూర్లో గల ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్లోకి పెళ్లి డ్రెస్సుతో యువకుడు వచ్చారు.