ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ..కేజ్రీవాల్పై పోటీ ఎవరంటే..?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా పార్టీలు ప్రచారం ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల పేర్లను విడుదల చేయడంతో హీట్ పీక్ స్టేజెస్కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా శుక్రవారం రోజున బీజేపీ 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. విడుదల చేసిన 57 మందిలో 11 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారుండగా, నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు గుర్రాల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం 70 స్థానాలు ఉండగా 57 మందితో కూడిన జాబితాను మాత్రమే విడుదల చేశారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి. అయితే ప్రకటించిన వారి పేర్లలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పోటీకి ఎవరు నిలబడే వ్యక్తి పేరును ఇంకా ప్రకటించలేదు. అన్ని ఈక్వేషన్స్ బేరీజు వేసుకున్న తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్లు మనోజ్ తివారీ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ పై పోటీచేసే అభ్యర్థి పేరును త్వరలోనే ప్రకటిస్తామని ఆమేరకు కసరత్తు చేస్తున్నట్లు తివారీ చెప్పారు.
అభ్యర్థుల పేర్లను ప్రకటించే సమయంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ కూడా ఉన్నారు. 57 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు చేశాక తుది జాబితాకు గురువారం రాత్రి బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపిందని తివారీ చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ముందస్తు సర్వేలు మాత్రం ఢిల్లీ నవాబ్ మళ్లీ అరవింద్ కేజ్రీవాలే అని జోస్యం చెప్పాయి. ఇక ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతుందని ఈ పోటీలో ఆప్ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెప్పాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీలోని 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఫిబ్రవరి 11న ఫలితాలు వెలవడనున్నాయి.
ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తుందేమో చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఓటర్లకు ప్రత్యేకించి ఏమైనా తాయిలాలు ప్రకటిస్తే అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆయన చెప్పారు.