ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆప్ సర్కార్ ఒక్క ప్రభుత్వ పాఠశాల భవనం కూడా నిర్మించలేదని అమిత్ షా విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఉన్న పాఠశాలల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు. అమిత్ షా చేసిన విమర్శలపై అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. విద్యను నీచరాజకీయాలతో అంటించరాదని అన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. విద్యార్థుల శ్రమను కించపరచరాదని చెబుతూ టీచర్లు, తల్లిదండ్రులు వారి ఉన్నతికి తోడ్పడుతున్నారని చెప్పారు.
కేజ్రీవాల్ 500 స్కూళ్లు నిర్మిస్తానని చెప్పారని అది పక్కనబెడితే ఉన్న స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని అమిత్ షా ధ్వజమెత్తారు. ఢిల్లీ రాష్ట్రంలోని 700 పాఠశాలలకు ప్రిన్సిపాల్లు లేరని చెప్పిన అమిత్ షా... 1000 స్కూళ్లల్లో సైన్స్ వింగ్ లేదని అన్నారు. అంతేకాదు 19000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా భర్తీ చేయలేదని వెల్లడించారు. కేజ్రీవాల్ విద్యకోసం కనీసం 30శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని అమిత్ షా ట్వీట్ చేశారు.
అమిత్ షా విమర్శలపై స్పందించిన కేజ్రీవాల్... కేంద్రహోంమంత్రే స్వయంగా వచ్చి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చూడాలన్నారు. కొంత సమయం కేటాయించి తనతో వస్తే ఢిల్లీ స్కూళ్లల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అమిత్ షాకు చూపిస్తామన్నారు. రోజంతా నెగిటివిటీతో ఉన్న అమిత్ షా... ఒక్కసారి ఢిల్లీ ప్రభుత్వ స్కూలు విద్యార్థులతో మాట్లాడితే కాస్త పాజిటివిటీ పెరుగుతుందని సూచించారు. ఇక బీజేపీలో ఉన్న సమయంలో మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న హర్శరణ్ సింగ్ బల్లి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారని కేజ్రీవాల్ చెప్పారు.