ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్కు ఆర్నెల్ల జైలు శిక్ష.. బెయిల్... ఎందుకో తెలుసా..?
ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్, అతని కుమారుడు సుమిత్ గోయల్ సహా మరో నలుగురికి ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోయల్ బీభత్సం సృష్టించారనే విచారణలో రుజువైంది. దీంతో వారికి శిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో రూ.10 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.
2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సర్వం సిద్ధమవుతున్నాయి. పోలింగ్కు ఒక్క రోజు ముందు మనీశ్ గాయ్ అనే రియల్టర్ ఇంటి వద్ద ఆప్ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ హల్చల్ చేశాడు. తన కుమారుడు సుమిత్ గోయల్ మరో కొందరితో కలిసి బీభత్సం సృష్టించారు. మనీశ్ ఇంటి వద్ద హంగామా చేశారు. దీంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై మనీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. ఇవాళ తుది తీర్పును ఢిల్లీ కోర్టు ప్రకటించింది. మనీశ్ ఇంటి వద్ద గోయల్ అండ్ కో రచ్చ చేశారని రుజువైంది. దీంతో వారికి ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
మనీశ్ ఇంటిలోకి గోయల్ అండ్ కో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారిని దూషించారు. గోయల్ అండ్ కో చేసిన రచ్చతో మనీశ్ ఫ్యామిలీ భయాందోళనకు గురైంది. గోయల్ అనుచరులు హితేశ్ ఖన్నా, అతుల్ గుప్తా, బల్బీర్ సింగ్ తదితరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ 448 సెక్షన్ కింద అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు.