600 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసిగా మారిన ఢిల్లీ బిలియనీర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 'ప్లాస్టిక్ కింగ్'గా పేరొందిన బిలియనీర్ భన్వర్ లాల్ రఘనాథ్ దోషి తన రూ. 600 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని త్యజించి సన్యాస దీక్షను స్వీకరించారు. ఆదివారం అహ్మాదాబాద్లో జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ ఆయనకు దీక్షను అందించారు.
దీంతో భన్వర్ లాల్ 108వ సన్యాసిగా సురిష్వరాజ్ జీ మహారాజ్ కింద ఉన్నారు. ఇప్పటి వరకు సురిష్వరాజ్ జీ మహారాజ్ 354 మందికి తన నేతృత్వంలో దీక్షను అందించారు. భన్వర్ లాల్ రఘనాథ్ దోషి 1982లోనే సన్యాస దీక్ష స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆయన వ్యాపారం, కుటుంబం అందుకు సహకరించలేదు.
భన్వర్ లాల్ రఘనాథ్ దోషికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ గ్రౌండ్స్లో జరిగిన ఈ దీక్షా స్వీకరణ కార్యక్రమానికి రూ. 100 కోట్లు ఖర్చయిందని, 1000 మందికి పైగా సాధువులు, సాధ్వీలు, లక్షన్నర మందికి పైగా జైనులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ హాజరై భన్వర్ లాల్కు గౌరవ సన్మానం చేశారు. అంతక ముందు శనివారం సాంప్రదాయ సంగీతం మధ్య సుమారు 7 కిలోమీటర్ల భిక్షాటన చేస్తూ నడిచిన భన్వర్ లాల్ రఘనాథ్ దోషి వెంట 1000 మంది జైన సన్యాసులు, 12 రథాలు, 9 ఏనుగులు, 9 ఒంటెలతో కలిసి భారీ సంఖ్యలో జైన మతస్తులు ఊరేగింపుగా వచ్చారు.