కుదిపేస్తున్న నిజాముద్దీన్ మర్కజ్.. కుట్ర కోణం ఉందేమోనన్న సంచలన ఆరోపణలు..
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా వ్యాప్తికి ఎపిసెంటర్గా మారడంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన లాగా తనకు అనిపించట్లేదని.. దీని వెనకాల ప్రీ-ప్లాన్డ్ కుట్ర కోణం ఉందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏ ఉద్దేశంతో ఆ జమాత్ను నిర్వహించారు.. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా నిజాముద్దీన్ మర్కజ్ను సీరియస్గా తీసుకుంది. దీని వెనకాల అసలేం జరిగిందో తేల్చాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఇప్పటికే ఎపిడెమిక్ చట్టం కింద జమాత్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోతైన విచారణ కోసం కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగించారు.
ఏ దేశాల నుంచి ఎంతమంది..
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఇండోనేషియన్లు-72,శ్రీలంక-34,మయన్మార్-33,కిర్గిస్తాన్-28,మలేషియా-20,నేపాల్-9,బంగ్లాదేశ్-9,థాయిలాండ్-7,ఫిజీ-4,ఇంగ్లాండ్-3,ఆఫ్ఘనిస్తాన్,అల్జీరియా,సింగపూర్,ఫ్రాన్స్,కువైట్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 16 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు మత ప్రార్థనలకు తరలివచ్చినట్టుగా గుర్తించారు. అయితే వీరిలో కొంతమంది వీసా నిబంధనలను ఉల్లంఘించి దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసినట్టు గుర్తించారు. తెలంగాణలోని కరీంనగర్కు వెళ్లిన 10 మంది ఇండోనేషియన్లు కూడా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా అనుమానిస్తున్నారు.
జమాత్ నిర్వాహకులు ఏమంటున్నారు..
ప్రధాని మోదీ లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా విదేశీయులతో కలిపి మొత్తం 1830 మంది మర్కజ్లోనే ఉండిపోయారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా 50మందికి మించి ఒకచోట గుంపుగా చేరవద్దని ఆంక్షలు విధించారు. అప్పటికీ మర్కజ్లో ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే జమాత్ నిర్వాహకులు మాత్రం.. లాక్ డౌన్ని ఊహించలేదని.. అనుకోకుండా చిక్కుకుపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చేందుకు సిద్దమయ్యాయి.
క్వారెంటైన్కి తరలింపు
మర్కజ్లోని దాదాపు 700 మందిని క్వారెంటైన్ చేసినట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ తెలిపారు. మరో 335 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. మర్కజ్లో ఉన్న మొత్తం 1830 మందిలో 200 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అయితే మర్కజ్కు వచ్చిన దాదాపు 2వేల మందిలో చాలామంది ఆయా రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో.. వారంతా ఎక్కడికెళ్లారు.. ఎవరెవరిని కలిశారన్నది గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్గా మారింది. స్వచ్చందంగా ముందుకు రావాలని చెబుతున్నా.. కొంతమంది మాత్రమే ఇప్పటివరకు రిపోర్ట్ చేశారు. నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లి వచ్చినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి. ఈ లెక్క ఎంత త్వరగా తేలితే తప్ప వైరస్ వ్యాప్తిని నియంత్రించడం సవాల్ గానే కనిపిస్తోంది.