బీజేపీ మల్లగుల్లాలు.. ఒక్కో సీటుకు 25 మంది పోటీ.. ఫైనల్ లిస్టుపై ఉత్కంఠ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ పేరును ప్రకటించకుండానే బరిలోకి దిగుతోన్న బీజేపీకి అభ్యర్థుల ఎంపిక మాత్రం సవాలుగా మారింది. ఢిల్లీ దేశరాజధాని కావడం, విద్యార్థి ఉద్యమాలకూ కేంద్రంగా ఉండటంతో టికెట్లు ఆశిస్తోన్నవారి సంఖ్య భారీగా ఉంది. ఈ నెల 14 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకానుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుంటే.. ఒక్కో సీటుకు గరిష్టంగా 25 మంది పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల పోటీదారుల సంఖ్య హాఫ్ సెంచరీని చేరుతోంది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్, అదే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.
అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీ బీజేపీ ఎన్నికల కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. అన్ని స్థానాలకు కలిపి సుమారు 1400 మందితో కూడిన ప్రాబబుల్స్ లిస్టు తయారుచేశామని, అందులోని ప్రతి పేరును స్క్రీనింగ్ చేసిన తర్వాతే తర్వాతే ఫైనల్ లిస్టును రూపొందిస్తామని నేతలు తెలిపారు. ఈనెల 14న మొదలయ్యే నామినేషన్ల పర్వం.. 21తో ముగుస్తుంది. ఒక్కో సీటుకు మినిమమ్ 15 మంది, మ్యాగ్జిమమ్ 25 మంది పోటీలో ఉన్నారని, కొన్ని చోట్ల ఈ సంఖ్య చాలా పెద్దదిగా ఉందని చెప్పారు. ఫైనల్ లిస్టు రూపకల్పనకు సమయం పట్టే అవకాశముందని వారు పేర్కొన్నారు.
అంతా ఫ్యామిలీలా..
తన లెక్క ప్రకారం ఢిల్లీలోని ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 మంది బలమైన నాయకులున్నారని, మొత్తం(70) నియోజకవర్గాలను కలుపుకుంటే సుమారు 3500 మంది ఉంటారని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్ చార్జి, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తామందరం ఫ్యామిలీలా కలిసుంటామని, ప్రజాస్వామిక పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన చెప్పారు.
స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే..
చివరిసారిగా 1998లో ఢిల్లీని ఏలిన బీజేపీ.. ఈసారి ఎలాగైనాసరే విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన ప్రచారకర్త, వ్యూహకర్తగా వ్యవహరిస్తారని మంత్రి జవదేకర్ ఇదివరకే చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ హోదాలో ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు రూపొందిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాతో మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, గిరిరాజ్ సింగ్, బీజేపీ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, సర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఎంపీలు సన్నీ డియోల్, హేమా మాలిని, మనోజ్ తివారీ, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ తోపాటు భోజ్ పురి తారలు పవన్ సింగ్, కేసరి లాల్ యాదవ్, హర్యానాకు చెందిన స్టేజ్ డ్యాన్సర్ సప్నా చౌదరి తదితరుల పేర్లున్నాయి.