ఢిల్లీ పేలుడు: విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలకు అలర్ట్, ఇజ్రాయెల్ మంత్రికి జైశంకర్ ఫోన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న తక్కువ తీవ్రత గల పేలుడుతో భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఫుట్పాత్ వద్ద పేలుడు సంభవించిందని, పార్కింగ్ చేసిన పలు కార్ల అద్దాలు పగిలిపోయాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అయితే, ఈ పేలుడు ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. పేలుడు ఘటన నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు అప్రమత్తం చేసింది. ప్రభుత్వ భవనాల, మెట్రో స్టేషన్ల వద్ద ఉండే భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేసింది. ఇక ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.
పేలుడు సంభవించిన ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని నిశితంగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఘటనా స్థలంలో ఎలాంటి బ్యాటరీ గానీ, ఎలక్ట్రానిక్ డివైస్ గానీ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
ఇది ఇలావుండగా, భారత విదేశంగ శాఖ మంత్రి జైశంకర్.. ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే భారత విదేశాంగ శాఖ సెక్రటరీ హర్ష్ వర్ధన్ శృంగ్లా కూడా ఇజ్రాయెల్ కౌంటర్ పార్ట్తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఎంఈఏ సెక్రటరీ సంజయ్ భట్టాచార్య.. మనదేశంలోని ఇజ్రాయెల్ అంబాసిడర్తో ఈ విషయంపై మాట్లాడారు.
మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇజ్రాయెల్ ఎన్ఎస్ఏతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. కాగా, హోంమంత్రి అమిత్ షా.. ఈ పేలుడు ఘటనపై అధికారులతో సమీక్షించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి పరిస్థితిపై వివరించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను అమిత్ షా ఆదేశించారు.