షాక్: ఈ రిక్షా బ్యాగులో మహిళ మృతదేహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారంనాడు దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఈ రిక్షాలోని ఈ సంచీలో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఆమె వయస్సు దాదాపు పాతికేళ్లు ఉంటుందని అంచనా. ఢిల్లీలోని మయూర్ విహార్లో గస్తీ నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆ విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించాడు.
మహిళను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో ఆమెను అంతకు ముందు రోజే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె కుర్తా, జీన్స్ ధరించి ఉంది. హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సమీపంలోని అపార్టుమెంటులో ఉంటున్న వ్యక్తి ఆ సంచీని మెట్రో స్టేషన్ వరకు తీసుకెళ్లాలని తనను అడిగినట్లు రిక్షా డ్రైవర్ చెప్పాడు. స్టేషన్ వద్ద సంచీని తీసుకుంటానని చెప్పాడని, కానీ అతను రాలేదని చెప్పాడు.
మహిళ మెడ మీద మచ్చ ఉందని, అది గాయం వల్ల అయిందా లేదా అనేది తెలియదని పోలీసులు అంటున్నారు. అది పుట్టుమచ్చయినా కావచ్చు లేదా గాయం కారణంగా అయిన మచ్చయినా కావచ్చునని చెబుతున్నారు. గత వారం రోజుల్లో అదృశ్యమైన మహిళల గురించిన సమాచారాన్ని జిల్లాలోని పోలీసు స్టేషన్లను అడిగామని చెప్పారు. మెడపై ఉన్న మచ్చ ఆమెను గుర్తించడానికి ఉపయోగపడవచ్చునని అంటున్నారు.