ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే... ఢిల్లీ పేలుడులో వెలుగులోకి సంచలన విషయాలు... ఇరాన్ హస్తం?
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయానికి సమీపంలో శుక్రవారం(జనవరి 30) రాత్రి చోటు చేసుకున్న పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ,ఐబీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సంఘటనా స్థలంలో దర్యాప్తు అధికారులకు ఓ లేఖ దొరికినట్లు తెలుస్తోంది. దానిపై ఇజ్రాయెల్ ఎంబసీ చిరునామాను గుర్తించిన అధికారులు... అందులో 'ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే' అని రాసి ఉండటాన్ని గుర్తించారు.
పేలుడు వెనుక ఇరాన్ హస్తం..?
ఆ లేఖలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ పేరును కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గతేడాది బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన వైమానిక దాడిలో సులేమానీ హతమైన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉందని... అమెరికా దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యుహుకు ముందే తెలుసునని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది. అంతేకాదు,గతేడాది నవంబర్లో ప్రముఖ ఇరాన్ అణుశాస్త్రవేత్త మోహసెన్ ఫఖ్రీజాదెహ్ హత్యకు కూడా ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుళ్ల వెనుక ఇరాన్ హస్తం ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పూలకుండీలో...
కారులో వచ్చిన దుండగులు ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాన్ని చుట్టి దాన్ని పూలకుండీలో విసిరేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అందులో బాల్ బేరింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. సగం కాలిన పింక్ చున్నీని సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం(జనవరి 29) బీటింగ్ రీట్రీట్ జరిగిన విజయ్ చౌక్ ప్రాంతానికి పేలుడు సంభవించిన ప్రాంతం కేవలం 2కి.మీ దూరంలోనే ఉండటం గమనార్హం. అత్యంత భారీ భద్రత ఉండే ప్రాంతానికి అతి సమీపంలో ఈ పేలుడు సంభవించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కొనసాగుతున్న దర్యాప్తు...
పేలుడుపై స్పందించిన ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అలాగే ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయానికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది. ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థలు దీనిపై విచారణ జరుపుతున్నాయని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో మాట్లాడి... ఇజ్రాయెల్ ఎంబసీకి,అక్కడి అధికారులకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఈ పేలుడులో మూడు కార్ల అద్దాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దొరికిన లేఖలో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని చెప్పడం ఆందోళన రేకెత్తిస్తోంది.