పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువు
ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరపగా అది కాస్త పూజా కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల చికిత్స తర్వాత పూజా తిరిగి వివాహ వేడుకలకు హాజరైంది.
తీవ్రంగా గాయపడిన పూజ కుడి కాలుకు పెద్ద బ్యాండేజీ కనిపించింది. అలా కుంటుతూనే వివాహం సందర్భంగా జరగాల్సిన మిగతా కార్యక్రమాల్లో పాల్గొంది. అగ్ని చుట్టూ పెళ్లికొడుకుతో కలిసి తిరుగుతున్న సమయంలో ఆమె నొప్పితో చాలా బాధపడింది. అలా కుంటుతూనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.దాదాపు 100 మంది అతిథులు ఈ వివాహానికి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పూజా వివాహం గతేడాది ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉండగా... పెళ్లి కొడుకు లక్ష్మణ్ సోదరుడు మృతి చెందడంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు పూజా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పెళ్లి కుమారుడు తరపున వచ్చిన అతిథులు సంబరాల సందర్భంగా తుపాకీతో గాల్లోకి కాల్చే ప్రయత్నం చేయగా అదికాస్త మిస్ఫైర్ అయి పూజా కాలికి తగిలిందని ఈస్ట్ డీసీపీ పంకజ్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని రింకుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. రింకూ అనే వ్యక్తి తనకు తెలియదని చెప్పిన పూజా... రింకూపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రింకు ఎవరో తనకు కూడా తెలియదని పెళ్లికుమారుడు తెలిపాడు.
పూజా ఇబ్బంది పడుతుండటంతో కాలు ఏమైనా బెసికిందని ముందుగా తాము భావించామని అయితే కాలునుంచి రక్తం కారుతుండటంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా ఆ గాయం బుల్లెట్ దూసుకెళ్లడంతో జరిగిందని తెలుసుకున్నట్లు పూజా తల్లిదండ్రులు చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడని పెళ్లి కుమారుడు లక్ష్మణ్ తెలిపాడు.అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నాడు.