బీమా డబ్బు కోసం.. సుపారీ ఇచ్చి తనను తానే చంపించుకున్నాడు!
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఎవరూ చేయలేని పని చేశాడు. తనను చంపమని తానే సుపారీ ఇచ్చాడు. ఇందుకు అతడు చేసిన అప్పులే కారణం కావడం గమనార్హం. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే అతడు ఇలా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దేశ రాజధానిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎక్స్టెన్షన్కు చెందిన కిరాణా దుకాణం యజమాని గౌరవ్(37) కనిపించడం లేదని ఆయన భార్య షానూ భన్సాల్ జూన్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో ఢిల్లీ శివారులోని రన్హౌలా ప్రాంతంలో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ఆ మృతదేహం గౌరవ్ దేనని కుటుంబసభ్యుల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. కాగా, గౌరవ్ ఎలా చనిపోయాడనే కోణంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపారు.
గౌరవ్ కాల్ రికార్డులు పరిశీలించగా తన హత్యకు తానే పథకం వేసుకుని ఓ హంతక ముఠాకు సుపారీ ఇచ్చాడని తెలిసింది. గౌరవ్ తన హత్య సుపారీని అప్పగించింది ఓ మైనర్కు కావడం గమనార్హం. జూన్ 9న ఇంటి నుంచి ప్రజా రవాణా ద్వారా బయటకు వెళ్లిన గౌరవ్.. చంపాల్సింది ఇతడినేనంటూ తన ఫొటోను నిందితుడు పంపించాడు.
ఈ నేపథ్యంలో నిందితులు గౌరవ్ ను తాళ్లతో కట్టేసి ఓ చెట్టుకు ఉరివేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యకు పాల్పడిన ముఠా సభ్యులు మనోజ్ కుమార్, సూరజ్, సుమిత్ కుమార్ తోపాటు, మైనర్ ను కూడా అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితుడు తనను తాను చంపించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.