రేప్ల్లో ఇదీ బ్రిటన్: లెస్లీ ఇండియాస్ డాటర్కు ఢిల్లీ బిజినెస్మెన్ కౌంటర్ వీడియో
లండన్: మహిళల పైన అత్యాచారాల్లో ప్రపంచంలోనే బ్రిటన్ ఐదో స్థానంలో ఉందని, కానీ నిందితుల్లో పదిమందిలో ఒకరిని మాత్రమే దోషిగా నిర్ధారిస్తున్నారని భారతీయ బిజినెస్మెన్ ఒకరు బీబీసీ ఇండియాస్ డాటర్కు కౌంటర్ వీడియో విడుదల చేశారు. నిర్భయ ఉదంతం నేపథ్యంలో బ్రిటన్ వనిత లెస్లీ ఉడ్విన్ చిత్రీకరించిన ఇండియాస్ డాటర్కు ప్రతిస్పందనగా 'యునైటెడ్ కింగ్డమ్స్ డాటర్' అనే వీడియోను హర్వీందర్ సింగ్ రూపొందించారు.
టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. లైంగిక వేధింపులనేవి భారత్కు మాత్రమే సంబంధించినవి కావి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చాటి చెప్పేందుకే తాను ఈ వీడియోను రూపొందించానని అతను చెప్పారు. బ్రిటన్లో వాస్తవంగా జరిగే అత్యాచారాలు ఇంతకంటే ఎక్కువే అన్నారు. ఎందుకంటే వాటిలో కొన్ని నమోదు కావని తెలిపారు. బ్రిటన్లోని పది శాతం మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు చెప్పారు.
బ్రిటన్ పౌరుల్లో మూడో వంతు వారు అత్యాచారాలకు మహిళలు బాధ్యులని నమ్ముతున్నారన్నారు. ఇక్కడి మహిళలు అత్యాచారాలని ప్రతిఘటించరని చెప్పారు. కాబట్టి మృతుల సంఖ్య తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. బ్రిటన్లో 41 శాతం పెళ్లిళ్లు 20 ఏళ్ల లోపే విడాకులకు దారి తీస్తున్నాయని, 11 శాతం జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉందన్నారు. 65 ఏళ్లకు పైబడిన 31 శాతం మంది వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన హర్వీందర్ సింగ్ ఈ వీడియోను రూపొందించారు. ఇది 28 నిమిషాల నిడివి గల వీడియో. అతని వయస్సు 60 ఏళ్లు. కాగా, ఈ వీడియోకు శుక్రవారం నాటికే 89వేల వ్యూస్ వచ్చాయి. కాగా, దీనిపై హర్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. తాను వారిలా ప్రొఫెషనల్ కాదని, ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ నుండి సేకరించానని చెప్పారు.
ఇండియాస్ డాటర్ హైదరాబాదులో ప్రదర్శన
ఇండియాస్ డాటర్ చిత్రాన్ని హైదరాబాదులో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఆల్ ఇండియా డెమోక్రాటిక్ వుమెన్స్ అసోసియేషన్ దీనిని ప్రదర్శించింది.