వైఎస్ జగన్ ఫార్ములాను ఫాలో అవుతోన్న కేజ్రీవాల్: ఢిల్లీలో ఆ పథకం అమలు: కేబినెట్లో ఆమోదం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. జగన్ సర్కార్ ఫార్ములాను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏపీలో చౌకధరల దుకాణాల ద్వారా అందజేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించినట్టే.. ఢిల్లీ సర్కార్ కూడా అలాంటి పథకాన్ని ప్రకటించింది. అర్హులకు రేషన్ సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతోంది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఢిల్లీ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన అని పేరు పెట్టింది. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలను తీసుకుంటున్నామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించినట్లు తెలిపారు. మంత్రివర్గం ఏకగ్రీవంగా ఈ పథకాన్ని ఆమోదించిందని, మంత్రులు హర్షం వ్యక్తం చేశారని అన్నారు.
నిత్యావసర సరుకుల కోసం లబ్దిదారులు రేషన్ షాపుల కోసం రావాల్సిన అవసరం లేదని అన్నారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను లబ్దిదారుల గడప వద్దకు పంపిణీ చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించబోతున్నామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలనేది ఢిల్లీవాసుల చిరకాల కల అని, దాన్ని తాము నెరవేర్చబోతున్నామని అన్నారు.
దేశ రాజధానిలో ప్రస్తుతం 2016 రేషన్ షాపులు ఉన్నాయని, వాటి ద్వారా సరుకులను లబ్దిదారుల ఇంటి వద్దకే చేర్చుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం అమల్లోకి వచ్చే రోజే తాము ఢిల్లీలో ఘర్ ఘర్ రేషన్ యోజనను ప్రారంభిస్తామని అన్నారు. దేశ రాజధాని పరిధిలో గల బస్తీల్లో వేలసంఖ్యలో పూరి గుడిసెలు ఉన్నాయని, ఇంటి వద్దకే సరుకులను పంపిణీ చేయడం వల్ల వారందరికీ మేలు కలిగించినట్టవుతుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తెల్లరేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఇదివరకే జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తీసుకుని రానుంది. 5, 10, 15, 20 కేజీల సామర్థ్యంతో కూడిన సంచులను రూపొందించింది. బియ్యం పంపిణీలో అవినీతి, అవకతవకలను నివారించడానికి జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో ట్రయల్ రన్ నడుస్తోంది.