వార్నీ.. ఇదేం పని? ఆ గుహ నిండా ఫోన్లు.. ల్యాప్టాప్లే!
ఢిల్లీలో మోతీభాగ్లో ఓ ఆరుగురు దొంగలు తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపంలో సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.
న్యూఢిల్లీ: దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. గుట్టలు గుట్టలుగా ఫోన్లు.. ల్యాప్టాప్లు బయటపడ్డాయి.
ఢిల్లీలోని మోతీభాగ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనుమానితులుగా భావిస్తున్న ఓ ఆరుగురు వ్యక్తులు.. తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపాన సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందకు కూడా ఈ దొంగలు గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేస్తున్నారు. ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా చిన్నదిగా ఉండటమేకాక ఇది జనావాసానికి దూరంగా ఉండటంతో ఎవరికీ దీని గురించి అనుమానం రాలేదు.
అయితే బుధవారం వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా ఈ నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గుహలో ఓ టార్చిలైటుతో పాటు ఖాళీ బీరు సీసాలు, ఎవరైనా వెంబడిస్తే తప్పించుకోవడానికి అనువైన పరికాలు ఉన్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.