Delhi Riots: ఢిల్లీ పోలీసులు చేతులెత్తేశారు..సైన్యమే దిక్కు: జవాన్లను దింపండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాకాండను నియంత్రించడంలో ఢిల్లీ పోలీసులు దారుణంగా విఫలం అయ్యారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సర్వశక్తులను ఒడ్డినప్పటికీ.. అల్లర్లు, దాడులు, ప్రతిదాడులను అడ్డుకోవడం, శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో,పోలీసులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సైన్యాన్ని దింపడం ఒక్కటే మార్గమని అన్నారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జవాన్లను ఢిల్లీలో దింపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండదు. లెప్టినెంట్ గవర్నర్ ఆధీనంలో పోలీసు వ్యవస్థ పని చేస్తుంది. గవర్నర్ సూచనలు, ఆదేశాల మేరకే అక్కడి పోలీసులు విధులను నిర్వర్తిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. సలహాలను మాత్రమే అందించగలుగుతుంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జఫ్రాబాద్, మౌజ్పూర్, యమునా నగర్ వంటి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న ఆందోళనకారులపై రెండురోజులుగా దాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని స్వాగతిస్తోన్న వారు ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులు, ప్రతిదాడుల బారిన పడి మరణించిన వారి సంఖ్య 20కి చేరుకుంది. పలువురు గాయాలపాలయ్యారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
I have been in touch wid large no of people whole nite. Situation alarming. Police, despite all its efforts, unable to control situation and instil confidence
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2020
Army shud be called in and curfew imposed in rest of affected areas immediately
Am writing to Hon’ble HM to this effect
Recommended Video
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం, సాధారణ పరిస్థితులను నెలకొల్ప గల సామర్థ్యం ఒక్క సైన్యానికి మాత్రమే ఉందని కేజ్రీవాల్ అన్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని, వెంటనే సైన్యాన్ని దింపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాలని అన్నారు.