కేజ్రీకి మరో గండం: సీఎం ఎదుటే సీఎస్పై ఎమ్మెల్యేల దాడి, గవర్నర్కు ఫిర్యాదు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఇంట్లో సీఎం కేజ్రీవాల్ చూస్తుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ ఆరోపించారు.
ప్రభుత్వ ప్రణాళికల గురించి చర్చించేందుకు సోమవారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన తనపై ఎమ్మెల్యేలు అజత్ దత్, ప్రకాశ్ జార్వల్ దాడి చేశారని అన్షు ప్రకాశ్ చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రకాశ్ తోపాటు పలువురు ఐఏఎస్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే అరెస్టు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిందితులపై చర్యలు తీసుకోకుంటే విధులు బహిష్కరిస్తామని ఐఏఎస్ అధికారులు స్పష్టం చేశారు. కాగా, చీఫ్ సెక్రటరీ అన్షు ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అన్షుపై ఎలాంటి దాడి గానీ.. దాడికి యత్నంగానీ జరగలేదని కేజ్రీవాల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ వ్యవహారంలో బీజేపీ కుట్ర దాగుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, చీఫ్ సెక్రటరీ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని.. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.