సీఎస్పై ఎమ్మెల్యేల దాడి: కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాశ్పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యలు దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఉన్నతాధికారులతో జరిగే సమావేశాలన్నింటికీ ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోచిస్తోంది. ఇదే సరైన విరుగుడు మంత్రంగా కేజ్రీవాల్ భావిస్తున్నారట.
గత సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై ఎమ్మెల్యేలు భౌతిక దాడికి దిగారంటూ ఢిల్లీ సీఎస్ అన్షు ప్రకాశ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు కూడా తిరస్కరించింది.
అయితే చీఫ్ సెక్రటరీపై దాడిచేశారన్న ఆరోపణలన్నీ అసత్యాలేనని సీఎం కార్యాలయం చెబుతోంది. ఎమ్మెల్యేలు ఎవరూ ఆయనపై చేయిచేసుకోలేదని స్పష్టం చేసింది. మరోవైపు సీఎస్ అన్షు ప్రకాశ్పై భౌతిక దాడి జరిగిన సూచనలు కనిపించాయని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తన వైద్య నివేదికలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఇకమీదట అధికారులు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా చెక్ పెట్టేందుకు సమావేశాలన్నింటికీ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేజ్రీవాల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, పనితీరులో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
వచ్చేనెలలో ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఒకవేళ ఉన్నతాధికారులతో సమావేశాల ప్రత్యక్ష ప్రసార నిర్ణయాన్ని కేబినెట్ గనుక ఆమోదిస్తే.. అందుకు కావాల్సిన నిధులను ఈ బడ్జెట్లోనే కేటాయించాల్సి ఉంటుంది.
అంతేకాదు, భవిష్యత్తులో ప్రభుత్వానికి చెందిన అన్ని ఫైళ్లను కూడా ఆన్లైన్లో పెట్టనున్నట్లు సమాచారం. 'ఇకపై ప్రభుత్వ ఫైళ్లన్నటినీ ఆన్లైన్లో పెట్టాలని యోచిస్తున్నాం. దీంతో ఆయా ఫైళ్లపై ఎవరు సంతకాలు చేశారు, ఎవరు చేయలేదు, తర్వాత సంతకం చేయాల్సిన వాళ్లు ఎవరు అన్నది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరు సంతకాలు పెట్టారన్నది కూడా ప్రజలు తెలుసుకోగలుగుతారు...' అని ఆప్కు చెందిన ఓ నేత పేర్కొన్నారు.