దాక్కొన్నానా: తాటా తీస్తా అంటున్న పోలీస్ బాస్
న్యూఢిల్లీ: ఆప్ శాసన సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీమ్ సేన్ బస్సీ ( బీఎస్. బస్సీ ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనవసరంగా తన మీద ఆరోపణలు చేస్తే చూస్తూ ఉండనని హెచ్చరించారు. తాను అవినీతికి పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్. బస్సీ భూములు కొనుగోలు చేసే వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని, అధికార దుర్వనియోగం చేశారని పలువురు అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసన సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బస్సీ ఘాటుగానే స్పందించారు. ఆప్ ప్రభుత్వం తన మీద చేస్తున్న దుష్ర్పచారానికి బెదిరిపోయి వారికి లొంగిపోనని స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో దాక్కొని పని చెయ్యడం లేదని గుర్తు చేశారు.
ఢిల్లీ కమిషనర్ కార్యాలయంలోనే తాను ఉంటూ విధులు నిర్వహిస్తున్నానని బస్సీ చెప్పారు. అవినీతికి, అక్రమాలకు పాల్పడేవారిని సమాధి చేస్తానని, వారి తాట తీస్తానని బస్సీ హెచ్చరించారు. మీ రాజకీయాలు నా మీద చేస్తే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు.
నిజాన్ని ఢిల్లీ ప్రజల ముందు ఉంచుతానన్నారు. తన మీద ఆదారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వారి మీద చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీ పోలీస్ బాస్ బస్సీ కౌంటర్ కు ఆప్ నేతలు పెదవి విప్పడం లేదు.