ఈశాన్య ఢిల్లీ ఆందోళనలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య, లెప్ట్నెంట్ గవర్నర్, కేజ్రీవాల్తో అమిత్ షా భేటీ..?
ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత తగ్గడం లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేస్తోన్న నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ సహా ఐదుగురు చనిపోగా.. 50 మంది వరకు గాయపడ్డ సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య ఏడుకి చేరింది. ఇరువర్గాలు దాడులతో 400 మీటర్ల వరకు రాళ్లు, ఇటుకలు, గాజు ముక్కలతో జాఫ్రాబాద్, మౌజ్పూర్లో రహదారి నిండి ఉన్నది.
మరోవైపు బ్రహ్మ్పుర్, మూజ్పుర్ వద్ద మంగళవారం ఉదయం అల్లరిమూకలు రాళ్లు విసిరారు. భద్రతా సిబ్బంది కవాతు నిర్వహించిన తర్వాత దుండగులు రెచ్చిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈశాన్య ఢిల్లీలో సిచుయేషన్కు సంబంధించి తమకు వరసగా ఫోన్లు వస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో పరిస్థితిపై చర్చించేందుకు వారిని పిలిచారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, వారి సమస్యపై చర్చించేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు జాఫ్రాబద్, మౌజ్పూర్-బాబర్పూర్, గోకుల్పురి, జాహ్రీ, శివ్ విహార్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సోమవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఒక్క ఆందోళనకారుడిని కూడా అరెస్ట్ చేయలేదు.
ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం రాత్రి సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో మంగళవారం నార్త్ బ్లాక్లో సమావేశం కానున్నారు. సమావేశంలో రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.