ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస: ఇరువర్గాల రాళ్లదాడిలో పోలీసు మృతి..ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
న్యూఢిల్లీ: ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగంటల్లో చేరుకునేందుకు సమయం ఉండగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింస చోటుచేసుకుంది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... తాజాగా ఆ నిరసనలు హింసకు దారి తీశాయి. ఢిల్లీలోని భజన్పురా, మౌజ్పూర్ మరియు జాఫ్రాబాద్లలో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. అంతేకాదు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో దేశరాజధాని ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీకి ఈ రోజు రాత్రికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఘర్షణవాతావరణం చోటుచేసుకుంటుండటంతో పోలీస్ వర్గాలకు నిద్ర పట్టనివ్వడం లేదు. జాఫ్రాబాద్లో 1000కి పైగా మహిళలు గుమికూడి సీఏఏకు వ్యతిరేకంగా తమ నిరసనలు తెలుపుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న క్రమంలోనే నిరసనలు హింసకు దారితీశాయి. హింసను నియంత్రించే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జరిగిన గొడవల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు.
ఇదిలా ఉంటే మౌజ్పూర్ బాబర్పూర్ మెట్రో స్టేషన్లపైకి నిరసనకారులు రాళ్లతో దాడులు చేసినట్లు సమాచారం. యమునా విహార్లోని కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. జాఫ్రాబాద్లో రెండు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఘటనలో గాయపడ్డవారిని జీటీబీ హాస్పిటల్కు తరలించారు. ఇక ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో జాఫ్రాబాద్, మౌజ్పూర్ , బాబర్పూర్ మెట్రో స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగకుండా వెళుతున్నాయి.
Recommended Video
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపు తప్పడం నిజంగా బాధిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు కేజ్రీవాల్. ఈశాన్య ఢిల్లీలో శాంతినెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ శాఖకు సూచించారు లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ బైజాల్. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇరు వర్గాల ప్రజలతో తాము మాట్లాడినట్లు ఈశాన్య ఢిల్లీ డీసీపీ వేద్ ప్రకాష్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని వెల్లడించారు.