ఎన్నేళ్లు సాగదీస్తారు..! జర్నలిస్టు హత్యకేసులో లాయర్లపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ : టీవి జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో తాత్సారం చేస్తున్నారంటూ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన్నేళ్లు సాగదీస్తారంటూ మండిపడ్డారు. సౌమ్య హత్య జరిగి పదేళ్లవుతున్నా.. ఆ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. 2008 లో జరిగిన హత్య కేసు ఇంతవరకు తేల్చకపోవడమేంటని ప్రశ్నించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నోటీసులు జారీచేయాలంటూ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. వారు స్పందించని పక్షంలో షోకాజు నోటీసులు జారీచేస్తామన్నారు. అవసరమైతే వారిని పక్కకు పెట్టి కొత్తవారిని నియమిస్తామన్నారు
2008, సెప్టెంబర్ 30 తెల్లవారుజామున ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో తన కారులోనే దారుణ హత్యకు గురయ్యారు జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్. గుర్తుతెలియని వ్యక్తులు వసంత్ కుంజ్ ఏరియాల్ ఆమెను కాల్చి చంపారు. ఆ కేసుకు సంబంధించి ఐదుగుర్ని నిందితులుగా భావించి 2009లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పదేళ్ల నుంచి కోర్టులో విచారణ కొనసాగుతున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో సౌమ్య విశ్వనాథన్ తండ్రి కేజ్రీవాల్ కు లేఖ పంపించారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల తీరును ఎండగడుతూ కొన్ని విషయాలు అందులో పేర్కొన్నారు. కావాలనే ఈ కేసులో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. విచారణకు హాజరుకాకుండా ఇబ్బందులు పెడుతున్నారని రాశారు. దయచేసి తమరు ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ మేరకు స్పందించిన కేజ్రీవాల్ లాయర్లపై ఫైరయ్యారు.