ప్రధానితో ఢిల్లీ సీఎం భేటీ.. మోడీతో కలిసి పనిచేస్తానన్న కేజ్రీ..
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన భేటీ అనంతరం కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాంచీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ తిరిగొచ్చిన ఆయనతో కేజ్రీవాల్ భేటీ అయ్యారు.
ట్రిపుల్ తలాక్పై లోక్సభలో రచ్చ.. శబరిమల అంశాన్ని లేవనెత్తిన అసద్..
వర్షాకాలంలో యమునా నదీ జలాలను నిల్వ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోందని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. వర్షాకాలంలో వచ్చే నీరు ఒక ఏడాది పాటు ఢిల్లీ నీటి అవసరాలను తీర్చడానికి సరిపోతుందన్న ఆయన.. ఇందుకోసం కేంద్రం మద్దతు కోరినట్లు చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడం అవసరమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. తన ప్రతిపాదనకు కేంద్రం అన్ని విధాల సహకారం ఇస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న మొహల్లా క్లినిక్, ప్రభుత్వ స్కూళ్లను సందర్శించాలని మోడీని కేజ్రీవాల్ కోరారు.
భేటీ సందర్బంగా ఇరువురు నేతల మధ్య ఆయుష్మాన్ భారత్ పథకం చర్చకు వచ్చింది. ఈ స్కీం కన్నా ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య పథకం బాగుందన్న విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తమ స్కీంతో కలిపి అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.