సీఎం కేజ్రీవాల్కు అవమానం..మెలానియా స్కూలు ప్రోగ్రాం జాబితానుంచి తొలగింపు..?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ స్కూలును సందర్శించనున్నారు. అయితే మెలానియా ట్రంప్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు కూడా భాగస్వాములు అవుతారని వార్తలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్కు కాన, మనీష్ సిసోడియాలకు కానీ అలాంటి ఆహ్వానం ఏమీ లేదని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, ఆగ్రా ఢిల్లీ నగరాలకు రానున్నారు. ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఆ సమయంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఢిల్లీ ప్రభుత్వం కిందికి వస్తాయి కాబట్టి సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే మెలానియా కార్యక్రమం నుంచి సీఎం కేజ్రీవాల్, సిసోడియా పేర్లను తొలగించడంపై ఆమ్ఆద్మీ పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ మండిపడింది.
మంగళవారం రోజున మెలానియా ట్రంప్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ అమలయ్యే హ్యాపీ కరుక్యులమ్ గురించి తెలుసుకుంటారు. మెలానియా ఏ ప్రభుత్వ పాఠశాలను నందర్శిస్తుందో ఇంకా అధికారులు వెల్లడించలేదు. దీంతో అన్ని పాఠశాలలకు మెరుగులు దిద్దుతున్నారు. హ్యాపీ కరుక్యులమ్ గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెలానియాకు వివరిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వీవీఐపీ కార్యక్రమానికి కేజ్రీవాల్ పేరునే జాబితా నుంచి తొలగించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక అగ్రరాజ్యపు ప్రథమ మహిళ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయరాదని హితవు పలికారు. రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే అని ఇలాంటి సందర్భాల్లో అంతా ఐక్యత చాటాలని చెబుతున్నారు.
ఇక అహ్మదాబాదులో సోమవారం ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి నేరుగా ఆయన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి వెళతారు. ఆ తర్వాత తాజ్మహల్ను సందర్శించి ఢిల్లీకి వెళతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరిస్తారు. అక్కడి నుంచి రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.