కోర్టుకు డుమ్మా: ఢిల్లీ సిఎం షీలాకి కోర్టు 5వేల జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు న్యాయస్థానం రూ.5వేల జరిమానా విధించింది. భారతీయ జనతా పార్టీ నేత వేసిన పరువు నష్టం దావా కేసులో న్యాయస్థానానికి హాజరు కానందుకు ఆమెకు ఈ జరిమానా విధించింది. షీలా పైన బిజెపి నేత విజేందర్ గుప్తా దావా వేశారు.
షీలా దీక్షిత్ పార్టీ వ్యవహారాల్లో బీజీగా ఉన్నారని, డిసెంబర్ 4న ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ నాయకులతో ఆమె సమావేశాలు జరుపుతున్నారని న్యాయస్థానానికి షీలా తరఫు న్యాయవాది దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు తెలిపారు.
ఈ రోజు కోర్టుకు హాజరు కానందుకు మినహాయింపును ఇచ్చిన న్యాయస్థానం ఐదువేల రూపాయలను జరిమానా చెల్లించాలని, తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బిజెపి నేత విజేందర్ సింగ్ తరఫున క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలంది.
గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బిజెపి నేత విజేందర్ గుప్తా తనను విలన్ అన్నారని, ప్రజలను మోసగించారన్నారని షీలా దీక్షిత్ ఆరోపించారు.