Sexual harassment: కేంద్ర మాజీమంత్రికి బిగ్ షాక్: మహిళా జర్నలిస్ట్ వైపే తీర్పు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటోన్న కేంద్ర మాజీమంత్రి ఎంజే అక్బర్కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పరువునష్టం దావా పిటీషన్ను ఢిల్లీ కోర్టు కొద్ది సేపటి కిందటే కొట్టేసింది. మహిళా జర్నలిస్ట్ ప్రియా రమణి తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎంజే అక్బర్.. ఆమెపై ఈ పరువునష్టం దావా వేశారు. ఈ పిటీషన్పై సుమారు రెండున్నరేళ్ల పాటు విచారణ కొనసాగింది. సాక్ష్యాధారలన్నింటినీ పరిశీలించిన తరువాత ఢిల్లీ రోజ్ అవెన్యూలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ పిటీషన్ను కొట్టేసింది.
తెలంగాణ రాజ్భవన్లో కీలక పరిణామం: గవర్నర్ తమిళిసైకి వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్
రోజ్ అవెన్యూ న్యాయస్థానం వెలువడించిన తీర్పు పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఎంజే అక్బర్ సంపాదకీయుడిగా పనిచేస్తోన్న సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి ఇదివరకు ఆరోపణలను చేసిన విషయం తెలిసిందే. మీ టూ (#Metoo) ఉద్యమంలో భాగంగా అప్పట్లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పెను సంచలనం రేపాయి. అప్పట్లో ఎంజే అక్బర్ కేంద్రమంత్రిగా ఉన్నారు. విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పని చేశారు.
మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగడంతో ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రియా రమణిపై పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ విచారణ బుధవారం నాటితో ముగిసింది. ఈ కేసులో ప్రియారమణి తరఫున సీనియర్ న్యాయవాది రెబెక్కా తన వాదనలను వినిపించారు. రోజ్ అవెన్యూ న్యాయస్థానం న్యాయమూర్తి రవీంద్ర పాండే వర్చువల్ విచారణ సందర్భంగా తన తీర్పును వినిపించారు. తమపై చోటు చేసుకున్న ఎలాంటి దాడులనైనా స్వేచ్ఛగా బయటికిచెప్పుకొనే హక్కు మహిళలకు ఉందని, దానిపై పిటీషన్లను వేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
తమపై సంభవించిన దాడులపై దశాబ్దాల తరువాత కూడా ఫిర్యాదు చేసుకునే హక్కు మహిళలకు ఉందని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారాల్లో మహిళలు ధైర్యంగా తమ గళాన్ని వినిపించాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తు చేసిందని అన్నారు. సమాజం తమకు కళాంకాన్ని అపాదిస్తుందనే భయంతో మహిళలు లైంగిక దాడులను మౌనంగా భరించడం సరికాదని వ్యాఖ్యానించారు. రోజ్ అవెన్యూ ఇచ్చిన తీర్పు పట్ల జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా రమణికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.