ఎయిర్సెల్ - మ్యాక్సిస్ కేసు : చిదంబరం, కార్తీకి రిలీఫ్.. ఆగస్టు వరకు నో అరెస్ట్
ఢిల్లీ : ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం, కార్తి చిదంబరానికి రిలీఫ్ దొరికింది. ఆగస్ట్ 1 వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ ఉత్తర్వులు జారీ చేశారు. తండ్రీకొడుకల ముందస్తు బెయిల్ పిటీషన్పై వాదనలకు ఈడీ మూడు వారాల సమయం కోరింది. కేసు దర్యాప్తు కోసం ఈడీ స్పెషల్ డైరెక్టర్ సింగపూర్ వెళ్లారని, తమ వద్ద ఉన్న బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని కోర్టుకు విన్నవించింది.
చిదంబరం, కార్తీల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఈడీ సమయం కోరినందున అప్పటి వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఆగస్టు 1 వరకు తండ్రీకొడుకులిద్దరినీ అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2006లో ఎయిర్సెల్ - మ్యాక్సిస్ ఒప్పందంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నిబంధనలు ఉల్లంఘించారని అప్పటి కేంద్ర మంత్రి చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తులో భాగంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదుచేసి మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ1 నిందితుడిగా చేర్చింది. ఆయనతో పాటు కొడుకు కార్తీ చిదంబరం, నాలుగు మ్యాక్సిస్ కంపెనీలు సహా 9మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తమను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ చిదంబరం, కార్తీలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు పలు దఫాలుగా రక్షణ పొడగిస్తూ వస్తోంది. తాజాగా ఆగస్టు 1వ తేదీ వరకు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.