ఉన్నావ్ లైంగికదాడి కేసులో కుల్దీప్ సెంగార్కు జీవితఖైదు, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని లైంగికదాడి చేసిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ తీస్ హజారీ కోర్టు జీవితఖైదు విధించింది. యువతిపై సెంగార్, సహా అతని అనుచరుడు శశి సింగ్ ఇతరులు కూడా లైంగికదాడి చేశారు. కేసు నమోదు చేశారని యువతి తండ్రి పోలీసు స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఉన్నావ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలన కలిగించింది. దీంతో కేసును ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రభావితం చేస్తారని తీస్ హజారీ కోర్టులో వాదనలు జరిగాయి. సెంగార్ను ఇప్పటికే కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. సెంగార్కు జీవితఖైదు విధిస్తున్నట్టు తీస్ హాజారీ ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది.
పరిహారం కూడా..
యువతిపై లైంగికదాడి చేసిన కుల్ దీప్ సెంగార్, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం కూడా ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఆర్థికసాయంతో బాధితులకు ఆర్థిక భరోసా లభిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఉఫాది కోసం ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ వద్దకొస్తే అతను, అనుచరుడు కలిసి లైంగికదాడి చేశారు. దీనిపై యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే తన పరపతి ఉపయోగించి యువతి తండ్రిని పోలీసులు స్టేషన్లో దాడిచేశారు. దీంతో అతను చనిపోవడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. తర్వాత యువతి కుటుంబాన్ని సెంగార్ అండ్ కో వేధిస్తూనే ఉన్నారు.
సెంగార్పై పోరాటం
తన తండ్రి చనిపోయిన యువతి మాత్రం ఎమ్మెల్యే సెంగార్పై పోరాటం చేస్తూనే ఉన్నారు. రాయ్ బరేలి కోర్టులో సాక్షం చెప్పేందుకు వెళ్తుండగా ట్రక్కుతో ఢీ కొట్టించారు. ఇది కుల్దీప్ సెంగార్ పనేనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు సాక్షులు చనిపోగా.. కొన ఊపిరితో బాధితురాలు బయటపడ్డారు. వెంటనే ఆమెను లక్నో తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర గాయాలతో మృత్యువుతో యువతి పోరాడుతూనే ఉన్నారు.
యూపీ టు ఢిల్లీ
ఫాస్ట్ట్రాక్ కోర్టు యూపీలో నియమిస్తే ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రభావితం చేస్తారని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. సెంగార్పై ఇంటా బయట పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో.. బీజేపీ హైకమాండ్ స్పందించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసుకు సంబంధించి వాదోపవాదనలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే సెంగార్ దోషి అని కోర్టు ప్రకటించింది. 20వ తేదీన శిక్ష ఖరారు చేస్తామని చెప్పి.. జీవితఖైదు విధించింది. అంతేకాదు బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం కూడా అందజేయాలని ఆదేశించింది.