సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాపై ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టైన దేవేందర్ కుమార్కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ రూ 50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
తనను నిర్బంధించడం అక్రమమని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కుమార్ ఢిల్లీ కోర్టులో బెయిల్ దరఖాస్తులో పేర్కొన్న విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చే క్రమంలో తనకు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని కూడా కుమార్ కోర్టుకు నివేదించారు.
కాగా, తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధతను కుమార్, ఆస్ధానాలు ఇప్పటికే న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ఈ కేసులో వీరితో పాటు మనోజ్ ప్రసాద్, సోమేష్ ప్రసాద్లను సైతం నిందితులుగా చేర్చారు.
ఇక మరో కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు దేవేందర్ కుమార్ ప్రయత్నించారని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. సీబీఐలో సీనియర్ అధికారుల మధ్య వివాదంలో తనను ఇరికించడంతో తాను బాధితుడినయ్యానని కుమార్ వ్యాఖ్యానించారు.