దిశా రవికి బెయిల్ ఇస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- పోలీసులకు అక్షింతలు
రైతుల నిరసనలు ఎలా చేయాలో వివరిస్తూ టూల్కిట్ రూపొందించి దాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి ఇవాళ ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఢిల్లీ పోలీసులు మోపిన ఆరోపణలు శిక్షార్హమైనవి కాదని పేర్కొన్న కోర్టు దిశా రవికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో పది రోజుల క్రితం అరెస్టైన ఆమెకు భారీ ఊరట లభించింది.
అయితే బెయిల్ మంజూరు సందర్భంగా ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నిషేధిత సిక్కు సంస్ధ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్తో కుమ్మక్కై రైతు ఆందోళనలను ప్రోత్సహించేందుకు పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి ప్రయత్నించారని, టూల్కిట్ పేరుతో ఉద్యమ వ్యూహాన్ని తయారు చేయడంతో పాటు దాన్ని వాట్సాప్లో షేర్ చేశారని ఆమెపై అభియోగాలు మోపారు. దీంతో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, టూల్కిట్ డాక్యుమెంట్కు ఎడిటర్గా ఉండటం శిక్షార్హమైన నేరాలు కావని ఢిల్లీ కోర్టు వారికి స్పష్టం చేసింది.
22 ఏళ్ల దిశా రవిని బెయిల్ తిరస్కరించడానికి తమకు తగిన స్పష్టమైన కారణాలు కనిపించడం లేదని ఢిల్లీ కోర్టు తీర్పు సందర్భఁగా స్పష్టం చేసింది. సిక్కు సంస్ధలతో దిశా రవికి సంబంధాలు ఉన్నట్లు నిరూపించే ఆధారాలు ఒక్కటి కూడా లేదని ఢిల్లీ పోలీసుల తీరుపై ఆక్షేపణ తెలిపింది. రైతు ఆందోళన కోసం ఆమె వ్యూహం రచించినట్లు నిరూపించే ఆధారాలు కూడా లేవని తెలిపింది. ఊహాజనితమైన విషయాల ఆధారంగా వ్యక్తుల స్వేచ్ఛను హరించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.