అన్నాడీఎంకే పార్టీ రెండాకులు: ఈసీకి రూ. 50 కోట్లు లంచం కేసు, దినకరన్ పేరు, కోర్టు ఆదేశాలు !
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వాలని ప్రయత్నించారని నమోదు అయిన కేసు విచారణ వేగవంతం అయ్యింది.
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి న్యూఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఇవ్వాలని ప్రయత్నించారని నమోదు అయిన కేసు విచారణ వేగవంతం అయ్యింది. కేసు దర్యాప్తు ప్రథమిక నివేదిక (సప్లమెంటరీ చార్జ్ షీట్) ఇవ్వాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేసిన కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేసిన నివేదికను డిసెంబర్ 5వ తేదీ లోపు సమర్పించాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టు క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సందర్బంలో ఆ పార్టీ రెండాకుల చిహ్నం తాత్కాలికంగా రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి శశికళ వర్గీయులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు.
భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అధికారులకు రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు టీటీవీ దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ను ఢిల్లీలో అరెస్టు చేశారు.
ఇదే కేసులో అరెస్టు అయ్యి 35 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ కేసులో అరెస్టు అయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసులో టీటీవీ దినకరన్ తదితరుల పేర్లు ఉన్నాయి.