చిదంబరానికి మరోసాకి చుక్కెదురు.. 4 రోజుల సీబీఐ కస్టడీ మాజీ కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం .. పిటిషన్ విచారణకు ముందే అరెస్టైన సంగతి తెలిసిందే. చిదంబరం అరెస్ట్ తర్వాత ఆయనను సీబీఐ ఐదురోజుల కస్టడీకి ఇచ్చింది. ఆ కస్టడీ నేటితో ముగిసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగిసింది. తొలుత సీబీఐ అధికారులు అడిగిన ఐదురోజుల కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చింది. అయితే ఈ కేసులో చిదంబరం సహకరించడం లేదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనలర్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సీబీఐ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి .. ఎఫ్ఐఎఫ్బీ క్లియరెన్స్ .. ఇతర అంశాలకు సంబంధించి విచారించేందుకు కస్టడీ గడువు పొడిగించాలని కోరారు. చిదంబరం తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వాలనే సీబీఐ వాదనను సిబల్ తోసిపుచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలు, ఈడీకి లభించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. మరో 4 రోజుల కస్టడీకి ఇస్తున్నట్టు పేర్కొన్నది. ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఈ నెల 30న కోర్టులో చిదంబరాన్ని ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.