ఉరిశిక్షా లేక యావజ్జీవ శిక్షా : బహిష్కృత BJPఎమ్మెల్యే కుల్దీప్కు శిక్ష ఖరారు చేయనున్న ఢిల్లీ కోర్టు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెన్గర్ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే శిక్ష ఖరారుపై శుక్రవారం కోర్టు తేల్చనుంది. మంగళవారం దోషిగా తేల్చిన జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ శుక్రవారం శిక్షను ఖరారు చేయనున్నారు. 2017లో ఉన్నావ్లో ఉద్యోగం కోసం అని వెళ్లిన యువతిపై ఎమ్మెల్యే అత్యాచారంకు పాల్పడ్డాడు. ఇక కేసులో కుల్దీప్ సెన్గర్కు యావజ్జీవ శిక్ష విధించాలని సీబీఐ వెల్లడించింది. న్యాయం కోసం మొత్తం వ్యవస్థపై ఒక అమ్మాయి పోరాటం చేసిందని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలోనే కుల్దీప్ సెన్గర్కు చట్టప్రకారం ఏదైతే ఎక్కువ శిక్ష ఉంటుందో అదే విధించాలని సీబీఐ కోర్టును కోరింది. అత్యాచార ఘటనల్లో అమ్మాయిలు పడ్డ వేదనను కోర్టు గ్రహించాలని నిందితులను అత్యంత క్రూరమైన నేరస్తులుగా పరిగణించి వారికి కఠిన శిక్ష విధించాలని సీబీఐ తరపున వాదించిన లాయరు చెప్పారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే సెన్గర్కు తక్కువ శిక్ష విధించాలని అంటే ఓ పదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని అతని తరపున వాదించిన లాయరు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సెన్గర్కు ఎలాంటి నేరచరిత లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.2002 నుంచి ఇప్పటి వరకు అతను ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారని కుల్దీప్ తరపున వాదించిన లాయర్ కోర్టును కోరారు.
ఇదిలా ఉంటే సెన్గర్పై అత్యాచారం కేసుతో పాటు పోక్సో చట్టంకూడా నమోదైంది. యువతిపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె ఇంకా మైనర్గానే ఉన్నింది. అయితే తనకు ఉత్తర్ ప్రదేశ్లో న్యాయం జరగదని కేసును మరో చోటికి బదిలీ చేయాలని అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కు లేఖ రాయడంతో ఆయన కేసును ఢిల్లీకి బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
ఇక అత్యాచారం కేసుతో పాటు బాధితురాలి తండ్రిపై అన్యాయంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయన మృతి చెందడం వెనక సెన్గర్ కుట్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అత్యాచార బాధితురాలు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ట్రక్కు వచ్చి ఢీకొనడం వెనక కూడా సెన్గర్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కారును ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా అత్యాచార బాధితురాలు మాత్రం ప్రాణాలతో బయటపడింది.