‘నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలి’: మరో జడ్జీకి బదిలీ చేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: 2012 నిర్భయ కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ దోషులకు ఉరిశిక్షను తీహార్ జైలు అధికారులు వేగవంతంగా అమలు చేయలా? వద్దా? అనే కేసును ఢిల్లీ కోర్టు మరో న్యాయమూర్తికి బదిలీ చేసింది.
బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు జిల్లా న్యాయమూర్తి యశ్వంత్ కుమార్ పరిధిలో ఉన్న ఈ కేసును అడిషనల్ సెషన్ జడ్జి సతీశ్ అరోరాకు బదిలీ చేశారు. నవంబర్ 28న ఈ కేసు విచారణ జరగనుంది.
గతంలో ఇద్దరు న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారించారని, వారి బదిలీ అనంతరం ఈ కేసు వాయిదా పడుతూ వస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు తమ దరఖాస్తులో తెలిపారు. పాటియాలా కోర్టులో లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉన్నప్పటికీ అక్కడ ఇప్పటి వరకూ జడ్జీని నియమించలేదు.
దోషులకు న్యాయపరంగా అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాతే కోర్టును ఆశ్రయించామని బాధితురాలి తల్లిదండ్రులు దరఖాస్తులో పేర్కొన్నారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష తొందరగా విధించాలంటూ గత డిసెంబర్ నెలలో బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 16, 2012లో 23ఏళ్ల పారామెడికల్ విద్యార్థిపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలతో ఆమె డిసెంబర్ 29న ప్రాణాలు వదిలింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దోషులను ఉరితీయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.