ఢిల్లీ : ప్రతీ ఐదు గంటలకో రేప్,19 గంటలకో మర్డర్.. షాకింగ్ క్రైమ్ డేటా...
దేశ రాజధాని ఢిల్లీలో 2020లో జరిగిన నేరాలకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం.. నగరంలో గతేడాది ప్రతీ ఐదు గంటలకు ఒక అత్యాచారం,ప్రతీ 19 గంటలకు ఒక హత్య,ప్రతీ 15 నిమిషాలకు ఒక చోరీ జరిగాయి. నిజానికి 2019తో పోలిస్తే 2020లో ఢిల్లీలో క్రైమ్ రేటు 16శాతం మేర తగ్గడం గమనార్హం. 2019లో ప్రతీ నాలుగు గంటలకొక అత్యాచారం,ప్రతీ 17 గంటలకు ఒక హత్య,ప్రతీ 12 నిమిషాలకు ఒక చోరీ చోటు చేసుకున్నట్లు గత డేటా చెబుతోంది.
2020లో మహిళలపై అత్యాచారాల డేటా..
మొత్తంగా 2020లో ఢిల్లీలో 1699 అత్యాచార ఘటనలు,2168 లైంగిక వేధింపుల ఘటనలు,చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 65 చోటు చేసుకున్నాయి. 2019తో పోల్చితే 2020లో కేసులు స్వల్ప మేర తగ్గాయి. 2019లో మొత్తం 2168 అత్యాచార ఘటనలు,2921 లైంగిక వేధింపుల ఘటనలు,చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు 109 నమోదయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఢిల్లీలో మహిళలపై అన్ని రకాల నేరాలు తగ్గినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.
రేప్ నిందితులు... బాధితులకు పరిచయమే..
ఢిల్లీలో 2019లో సగటున ఒకరోజులో 17 చైన్ స్నాచింగ్ ఘటనలు జరగ్గా... 2020లో ప్రతీ గంటకో స్నాచింగ్ జరిగినట్లు వెల్లడైంది. 2020లో నమోదైన అత్యాచార కేసుల్లో 1.77శాతం కేసుల్లో మాత్రమే నిందితులు బాధితులకు అపరిచితులని తేలింది. ఈ సంఖ్య 2019లో 2.20శాతంగా ఉంది. 2020లో నమోదైన మొత్తం 1699 అత్యాచార ఘటనల్లో 318 కేసుల్లో నిందితులు,బాధితులు సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్)లో ఉన్నట్లు తేలింది. పెళ్లికి నిరాకరించడం వల్లే బాధితులు అత్యాచార కేసులు పెట్టారు.
ఆ చర్యలతోనే సాధ్యమైందని...
మహిళల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును ఉన్నత స్థాయిలో పర్యవేక్షించడం,నేరాలు జరిగే ప్రదేశాలను హాట్ స్పాట్స్గా గుర్తించి చర్యలు తీసుకోవడం,మహిళా పోలీసులను బీట్ కానిస్టేబుల్స్గా పంపించడం వంటి చర్యలతో 2020లో ఢిల్లీలో మహిళలపై నేరాలు తగ్గినట్లు కమిషనర్ శ్రీవాస్తవ తెలిపారు. గతేడాది లాక్డౌన్ కారణంగా దాదాపు 4 నెలల పాటు జనం ఇళ్ల నుంచి కదల్లేదు. బహుశా 2020లో క్రైమ్ రేటు తగ్గడానికి ఇది కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు.
మహిళలపై నేరాల చిట్టా
2019లో ఢిల్లీలో అన్ని రకాల నేరాలు కలిపి మొత్తం 3,16,261 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2020లో 2,66,070కి పడిపోయింది. 2019లో మహిళలపై 9365 నేరాలు జరగ్గా... 2020లో ఆ సంఖ్య 7322కి పడిపోయింది. అంటే 19శాతం మేర మహిళలపై నేరాలు తగ్గాయి. మహిళలపై నేరాల కేసుల్లో 90శాతం కేసులు పరిష్కారమైనట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టుల విషయానికొస్తే... 2019తో పోలిస్తే 2020లో 15.43శాతం మేర పెరిగాయి. 2019లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా 2020లో 32 మందిని అరెస్ట్ చేశారు.