వైద్యుడికి కరోనా పాజిటివ్.. డాక్టర్ల పట్ల నిర్దయగా ఇంటి యజమానులు.. కేజ్రీవాల్ వార్నింగ్..
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న,మొన్నటివరకు విదేశాల నుంచి వచ్చినవాళ్లలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడగా.. గడిచిన ఒకటి,రెండు రోజుల్లో లోకల్ కాంటాక్ట్ కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలోని మౌజ్పూర్లో ఉన్న మొహల్లా క్లినిక్లో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ వైద్యుడిని కలిసి పేషెంట్స్,ఇతరుల వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు.
లోకల్ కాంటాక్ట్ కేసా..?
మార్చి 12 నుంచి మార్చి 18 వరకు మొహల్లా క్లినిక్కి వచ్చి.. ఆ వైద్యుడిని కలిసినవారందరినీ క్వారెంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. ఒకవేళ కరోనా లక్షణాలు బయటపడితే తక్షణం డాక్టర్ను సంప్రదించాల్సిందిగా చెప్పారు. తాజాగా వైరస్ సోకిన ఆ వైద్యుడి ట్రావెల్ హిస్టరీ గురించి స్పష్టత లేదు. అతను ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడా.. లేక లోకల్ కాంటాక్ట్ కేసా.. అన్నది తేలాల్సి ఉంది.
ఒక్కరోజే 5 పాజిటివ్ కేసులు
ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలోని చాలాచోట్ల ప్రాథమిక చికిత్స కేంద్రాలుగా మొహల్లా క్లినిక్ సెంటర్స్ను నిర్వహిస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాలే ఈ సెంటర్స్కు ఎక్కువగా వస్తుంటారు. అలాంటిచోట వైద్యుడికే పాజిటివ్ కేసు నమోదవడంతో.. మౌజ్పూర్లో అది ఇంకా వ్యాప్తి చెందనుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం(మార్చి 25)న రాష్ట్రంలో 5 కొత్త కేసులు నమోదైనట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే వారంతా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. ప్రస్తుతం అక్కడ మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 35కి చేరింది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కు ఈపాస్..
లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్స్పై పోలీసులు దాడులు చేస్తుండటంపై కేజ్రీవాల్ స్పందించారు. వారికి ప్రత్యేకంగా ఈ-పాస్ ఇస్తామని చెప్పారు. పోలీసులు వారిని ఆపినప్పుడు ఈపాస్ చూపిస్తే వదిలిపెడుతారని అన్నారు. పాలు,కూరగాయలు,కిరాణ వస్తువులు,ఇతరత్రా నిత్యావసర వస్తువులు విక్రయించేవారు 1031కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఈపాస్ పొందవచ్చునని చెప్పారు. అదే సమయంలో ప్రజలు తమ నివాసాలకు సమీపంలోని కిరాణ షాపులకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవచ్చునని.. దానికి ఎవరూ అడ్డు చెప్పరని తెలిపారు. నైట్ షెల్టర్స్లో తలదాచుకుంటున్న పేదల కోసం ఫుడ్ సప్లై చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉచితంగా ఆహారం అందించే కేంద్రాలను కూడా పెంచుతున్నట్టు చెప్పారు.
Recommended Video
ఇల్లు ఖాళీ చేయమని వైద్యులకు బెదిరింపులు..
వైద్యుడికి కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో కొంతమంది ఇంటి యజమానులు వైద్యులను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా బెదిరిస్తుండటాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతటి సంక్షోభ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను విస్మరించి.. వారిని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా బెదిరించడాన్ని ఎంతమాత్రం సహించరాదని నెటిజెన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. వైద్యులు తమకెందుకులే అని వదిలేస్తే భారత్ పరిస్థితిని ఊహించుకోవడం దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అటు ప్రధాని మోదీ,ఇటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇలాంటి తరుణంలో డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉందని గుర్తుచేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా స్వార్థపూరితంగా వ్యవహరించి.. వారిని ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. దీనికి ఆదిలోనే చెక్ పెట్టకపోతే వైద్యులందరిపై తీవ్ర ప్రభావం చూపించి అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.