అన్నా హజారే, బాబా రాందేవ్, కిరణ్ బేడీ లేరు, కానీ ఢిల్లీ ప్రజల మదిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత. ముచ్చటగా మూడోసారి ఢిల్లీని ఏలబోతోన్న యువరాజు. ఆప్ పార్టీ ఏర్పాటు చేసే సమయంలో అన్నాహజారే, బాబా రాందేవ్, కిరణ్ బేడీ లాంటి ఉద్దండులు ఉండేవానే.. అలా 2013లో పార్టీ కాస్త సత్తా చాటింది. 2015 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక్కొక్కరు దూరమవుతూ వచ్చారు. బాబా రాందేవ్-మోడీతో సన్నిహితంగా మెలుగుతోండగా.. కిరణ్ బేడీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. అన్నా హజారే మాత్రం తన స్వస్థలం రాలేగావ్ సిద్ధికే పరిమితమయ్యారు. పార్టీ ఆవిర్భావంతో ఉన్న ఉద్దండులు లేకున్నా.. అరవింద్ కేజ్రీవాల్ వరసగా మూడోసారి ఢిల్లీలో ఎలా గెలిచారు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.
లోక్పాల్ కోసం..
2009లో కేంద్రంలో యూపీఏ మరోసారి అధికారం చేపట్టింది. లోక్పాల్ అమలు చేయాలని అన్నాహజారే ముందుకొచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్ష చేస్తే ప్రభుత్వ పీఠాలు కదిలిపోయాయి. అన్నాహజారేకు బాబా రాందేవ్, కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు.
పార్టీ ఆవిర్భావం..
2012 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పేరు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా నెలకొల్పారు. అలా క్రమంగా శక్తిమంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మరుసటి ఏడాది 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్కు చెప్పడంతో ఆప్ 28 స్థానాలకు, కాంగ్రెస్ 8 సీట్లతో బయటనుంచి సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం కొలువుదీరింది.
2015లో ఆప్ ప్రభంజనం..
2015లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే.. ఆప్ ప్రభంజనం సృష్టించింది. 67 సీట్లు సాధించి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చింది. గత ఎన్నికల్లో 32 సీట్లు సాధించిన బీజేపీ.. కేవలం 3 సీట్లతో సరిపెట్టుకొంది. 2013లో ఆప్కు 29.5 శాతం ఓట్లు రాగా.. 2015లో అది 54.3 శాతానికి చేరడం విశేషం. ఇక అప్పటినుంచి ఆప్కు తిరుగులేకుండా పోయింది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ..
లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీజేపీ దక్కించుకోవడం కాస్త కలవరానికి గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా ఉంది. దీంతో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతాయా అనే ఉత్కంఠ నెలకొంది. కానీ సామాన్యుడి ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం మరోసారి ఊడ్చివేసింది.
ఆప్కు తిరుగులేదు
2020 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని రాజకీయశక్తిగా ఆప్ అవతరించింది. మెజార్టీ స్థానాలు సాధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ పరిస్థితి కాస్త మెరుగుపడింది. గతంలో 3 సీట్ల నుంచి 14 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా తెరవకపోవడం విశేషం. ఆప్కు 56 సీట్ల వరకు రావడంలో.. అరవింద్ కేజ్రీవాల్ పేరు, అభివృద్ధి నినాదం పనిచేసింది. మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల్లో రాయితీ, సురక్షితమైన మంచినీరు, కరెంట్ చార్జీల తగ్గింపు లాంటి విధానాలను ఢిల్లీ ప్రజల మదిని దోచింది. మరోసారి అధికారం ఇస్తే మరింత ముందుకు తీసుకెళతారని పట్టం కట్టారు.
కేజ్రీవాల్ ఒక్కరే..
అంతేకాదు పార్టీ ఆవిర్భావ సమయంలో తనతో ఉన్న నేతలు లేకున్నా.. కేజ్రీవాల్ను విమర్శించి నేతలు బయటకెళ్లినా.. ప్రభ మాత్రం తగ్గలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆప్ మరోసారి అవతరించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముద్ర ఉంది. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆమ్ ఆద్మీ పార్టీని మరోసారి గెలిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.