అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, దేశభక్తి పేరుతో బీజేపీ మోసం చేస్తోంది: ఆప్ నేత రాఘవ్
హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఊడ్చేసింది. బీజేపీ, కాంగ్రెస్.. ఏ ఇతర పార్టీకి అవకాశం ఇవ్వకుండా చేసింది. 63 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ దెబ్బకు బీజేపీ సహా ఇతర పార్టీల పరిస్థితి చావుతప్పి కన్నులొట్టబోయినా చందంగా మారింది. ఇవాళ కేజ్రీవాల్ సతీమణి సునీత పుట్టినరోజు కూడా.. ఓకే రోజు రెండు పండగలు ఆప్ నేతలకు వచ్చినట్టుంది.
కేజ్రీవాల్ దేశభక్తుడు..
ఢిల్లీలో ప్రచార పర్వం పీక్ స్టేజీకి చేరిన క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఉగ్రవాదిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. రాజిందర్ నగర్లో 20 వేల మెజార్టీతో గెలుపొందిన తర్వాత ర్యాలీ తీశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవల్ నిజమైన దేశ భక్తుడు అని చెప్పారు.
దేశభక్తి పేరుతో మోసం..
కేజ్రీవాల్ దేశభక్తుడనే విషయాన్ని ఢిల్లీ ప్రజలు నిరూపించారని గుర్తుచేశారు. కేజ్రీవాల్ దేశ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని.. కేజ్రీవాల్ చేసే పని దేశభక్తికి నిదర్శనం అని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం దేశభక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని ఓ దేశభక్తుడిలా కేజ్రీవాల్ పనిచేస్తున్నారని కొనియాడారు. కానీ బీజేపీ అలా కాదని ధ్వజమెత్తారు.
63 చోట్ల
ఢిల్లీలో ఆప్ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 37 చోట్ల ఇప్పటికే విజయం సాధించింది. బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం విశేషం. ఢిల్లీలో వార్ వన్ సైడ్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.