ఢిల్లీ పోలింగ్ శాతంపై గడబిడ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్: ఫైనల్ ఫిగర్.. !
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నిప్పులు చెరిగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులుస్పందించారు. వివరణ ఇచ్చారు. ప్రాంతాలవారీగా నమోదైన పోలింగ్ శాతాన్ని వెల్లడించారు.
వివరాల నమోదులో జాప్యం..
ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి రణ్బీర్ సింగ్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన వివరాలను సేకరించడంలో జాప్యం చోటు చేసుకుందని, అందుకే తాము సకాలంలో వాటిని వెల్లడించలేకపోయామని అన్నారు. శనివారం నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 62.59 ఓట్ల శాతం నమోదైందని తెలిపారు.
అర్ధరాత్రి కూడా పోలింగ్..
ఢిల్లీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్ధరాత్రి కూడా పోలింగ్ కొనసాగిందని రణ్బీర్ సింగ్ తెలిపారు. పోలింగ్ శాతాన్ని నమోదు చేయడంలో జాప్యం చోటు చేసుకోవడానికి ఇదీ ఓ కారణమని అన్నారు. పోలింగ్ శాతాన్ని క్రోడీకరించడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. దీనితోపాటు- అప్పటికే ముగిసిన పోలింగ్ కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తరలించడం, వాటికి గట్టి భద్రత ఏర్పాటు చేయడం వంటి చర్యలపై దృష్టి పెట్టాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా చర్యల్లో నిమగ్నం కావడం వల్ల పోలింగ్ శాతాన్ని సకాలంలో నమోదు చేయలేకపోయామని చెప్పారు.
అత్యధికం 71.6, అత్యల్పం 45.4 శాతం
ఢిల్లీ పరిధిలోని బల్లిమారన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6 శాతం పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలో అత్యల్పంగా 45.4 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. ఓఖ్లా షహీన్ బాగ్ సెగ్మెంట్లో 58.84 శాతం పోలింగ్ చోటు చేసుకుందని అన్నారు. మొత్తంగా చూసుకుంటే.. 62.59 శాతం పోలింగ్ నమోదు కాగా.. గత ఏడాది నిర్వహించిన లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే రెండు శాతం, 2015 నాటి అసెంబ్లీ ఎన్నికలతో బేరీజు వేసుకుంటే అయిదు శాతం తక్కువ పోలింగ్ నమోదైందని అన్నారు.
ఈవీఎం కేంద్రాల వద్ద భద్రత స్వయంగా పర్యవేక్షణ..
ఢిల్లీ పరిధిలో మొత్తం 22 ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచామని అన్నారు. ఢిల్లీ పోలీసులు మరింత భద్రతను, నిఘాను కల్పించాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడుతోందని చెప్పారు. ఈవీఎంలను భద్రపరిచిన భవనాలకు కల్పించిన పోలీసు భద్రతను తాము స్వయంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. సున్నితమైన షహీన్ బాగ్ వంటి సెగ్మెంట్లలో కూడా పోలింగ్ సజావుగా సాగిందని రణ్బీర్ సింగ్ చెప్పారు.
కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్..
నిజానికి- ఎన్నికల కమిషన్ అధికారులు ఈ ప్రెస్మీట్ను నిర్వహించడానికి, పోలింగ్ శాతంపై నెలకొన్న అనుమానాలు, గందరగోళం పట్ల స్పందించడానికీ కారణం లేకపోలేదు. ఖచ్చితమైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించకపోవడం పట్ల అరవింద్ కేజ్రీవాల్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారుల తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కామెంట్స్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు.