ఢిల్లీ ఎన్నికలు: బిజెపికి తగ్గిన ఓట్లు 1 శాతమే, సీట్లన్నీ గుల్ల
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఓట్లు పటిష్టంగానే ఉంది, కానీ ఆ పార్టీ సీట్లే గల్లంతయ్యాయి. కాంగ్రెసు పార్టీ సీట్లపరంగానే కాకుండా ఓట్ల పరంగా కూడా చావు దెబ్బ తిన్నది. 2013 ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి 68 సీట్లకు పోటీ చేసి 31 సీట్లలో విజయం సాధించింది. దాని ఓట్ల శాతం 33.07. బిజడెపి 26 4 వేల 100 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి పోలైన ఓట్ల శాతం దాదాపుగా అంతే ఉంది. ఒక్క శాతం ఓట్లు మాత్రమే బిజెపి తగ్గాయి. ప్రస్తుతం బిజెపి 32.1 శాతం ఓట్లు పోలయ్యాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెసు 70 సీట్లకు పోటీ చేసి 8 సీట్లను గెలుచుకుంది. దాని ఓట్ల శాతం 24.55 శాతం (1932933 ఓట్లు). ఈ ఎన్నికల్లో దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. కాంగ్రెసుకు కేవలం 8.4 లక్షల ఓట్లతో 9.8 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ రకంగా కాంగ్రెసు 15 శాతం ఓట్లను నష్టపోయింది.
బిఎస్పీ గత ఎన్నికల్లో 5.35 శాతం ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో కేవలం 1.3 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. దీన్నబట్టి కాంగ్రెసు ఓట్లతో సహా చిన్న పార్టీల ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టినట్లు కనిపిస్తోంది. 2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్లకు పోటీ చేసి 28 సీట్లు గెలుచుకుంది. 2322330 ఓట్లతో 29.49 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 54.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 47 లక్షల 26 వేల 705 ఓట్లు ఈ పార్టీకి వచ్చాయి. ఆరకంగా ఆమ్ ఆద్మీ ఓట్ల శాతం అదనంగా 25 పెరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెసు ఓట్లనే కాకుండా ఇతర చిన్న పార్టీల ఓట్లను కూడా సొంతం చేసుకుంది. బిజెపి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గిన ఓట్లు చాలా తక్కువ. అయితే, కాంగ్రెసు, ఇతర చిన్న పార్టీల ఓట్లను బిజెపి రాబట్టుకోలేకపోయింది.