ఢిల్లీ ఎన్నికలు: 70 మంది ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల, న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) మంగళవారం విడుదల చేసింది. న్యూఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా.. డిప్యూటీ సీఎం పత్పార్గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఏపీ నేతలందరూ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. చాందినీ చౌక్ నుంచి పర్లాద్ సింగ్ సాహ్నీ, డ్వార్కా నుంచి వినయ్ కుమార్ మిశ్రా, గాంధీనగర్ నుంచి దీపూ చౌదరి పోటీ చేయనున్నారు. మనోజ్ కుమార్ స్థానంలో కోండ్లి నుంచి పార్టీ అధికార ప్రతినిధి కులదీప్ కుమార్కు ఆప్ టికెట్ ఇచ్చింది.
ఈ మేరకు ట్విట్టర్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. త్వరల జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అందరూ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులంతా వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజల ఆశీర్వదంతో గెలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ కూడా ఏమరపాటుగా ఉండొద్దని, గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని అన్నారు. ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీపై, మీ(అభ్యుల)పై నమ్మకముందని తెలిపారు. గాడ్ బ్లెస్ అంటూ ట్వీట్ ముగించారు.
Important Announcement :
— AAP (@AamAadmiParty) January 14, 2020
Aam Aadmi Party declares all 70 candidates for the upcoming Delhi election.
We congratulate all the candidates and wish them all the best to establish high levels of trust and integrity within their constituency.#AAPKeCandidates pic.twitter.com/mbby8Z2GCR
కాగా, ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. అదే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ మాత్రం మూడు సీట్లకే పరిమితమైంది.